మార్కెట్లో జోరు 60 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలు అందిస్తున్నా. ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నా దేశీ మార్కెట్ సూచీలు జోరు కొనసాగిస్తున్నాయి. కార్పోరేట్ కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్న మూడో త్రైమాసిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఇన్వెస్టర్లకు మార్కెట్పై నమ్మకం పెరిగింది. ఫలితంగా సోమవారం కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాలు పొందాయి.
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 59,774 పాయింట్లతో మొదలయ్యింది. ఉదయం 9:15 గంటల సమయానికి 325 పాయింట్లు లాభపడి 60,070 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 17,913 పాయిట్ల దగ్గర కొనసాగుతోంది. సాయంత్రం వరకు మార్కెట్ ట్రెండ్ ఇలాగే ఉంటుందా ? లేక ఇన్వెస్టర్లు మరోసారి స్వల్పకాల లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతారా అనేది సాయంత్రంలోగా తేలనుంది.