సింగరేణిలో మస్టర్ల ఫికర్
ఏడాదిలో 100 నుంచి 150కు
కనీస మస్టర్ల పెంపు
గైర్హాజర్ కార్మికులను ఈ నెల 5 లోగా గుర్తించాలని ఆదేశాలు
కౌన్సెలింగ్, క్రమశిక్షణ చర్యలు
తీసుకోనున్న యాజమాన్యం
అందరూ స్వాగతించాలి
గైర్హాజరు తగ్గవచ్చు..
కొత్తగూడెంఅర్బన్: సాకులు చెప్పి విధులకు డుమ్మా కొట్టే సింగరేణి కార్మికుల ఉద్యోగానికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. యాజమాన్యం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్తో కార్మికులు గుబులు చెందుతున్నారు. గైర్హాజరును తగ్గించి, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదతక పెంచేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. కఠిన నిర్ణయమైనా గైర్హాజరు కార్మికులను దారిలో పెట్టేందుకు పని చేస్తుందని కొన్ని కార్మిక సంఘాలంటే, మరికొన్ని సంఘాలు మాత్రం నిబంధనలు కార్మికులపై కొరడా దెబ్బలని పేర్కొంటున్నాయి. సింగరేణి కార్మికులకు ఏడాదికి 100 మస్టర్ల హాజరు నమోదు కావాలి. ప్రస్తుతం ఆ నిబంధనను 150 మస్టర్లకు పెంచారు. ఏడాదిలో 150 మస్టర్లులేని కార్మికుల వివరాలను ఈ నెల 5వ తేదీలోగా అందించాలని సీఎండీ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో గైర్హాజరు కార్మికులను గుర్తిస్తున్నారు. గనుల నోటీసు బోర్డుల్లో వివరాలు ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత కార్మికుల పేర్లనూ నోటీస్ బోర్డుల్లో ఉంచనున్నారు. వచ్చే జనవరి నెలాఖరుకు చార్జీషీట్ ఇచ్చి, ఫిబ్రవరి 15 లోగా వివరణ తీసుకుంటారు. వివరణ సహేతుకంగా లేకపోతే మార్చి 15 లోగా విచారణ పూర్తి చేసి, ఏప్రిల్లో కౌన్సెలింగ్ ఇస్తారు. నెలలో భూగర్భ గనుల్లో 16 మస్టర్లు, ఉపరితలంలో 20 మస్టర్ల కంటే తక్కువ హాజరుకలిగినవారి వివరాలను కూడా ఈ నెల 5వ తేదీలోగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. భూగర్భ గనుల్లో మూడు నెలలపాటు హాజరు ఇలాగే ఉంటే గని మేనేజర్ స్థాయి కమిటీకి పంపించాలని, గైర్హాజరు కౌన్సెలింగ్కు కూడా హాజరు కాకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడే వారు సిక్ లెటర్ సమర్పిస్తే సరిపోతుంది. సరైనా కారణాలు లేకుండా విధులకు హాజరుకాని కార్మికులకు మాత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. గైర్హాజరు కార్మికులు ఇకనైనా మేల్కొనకపోతే సింగరేణి యాజమాన్యం తీసుకోబోయే చర్యలకు బాధ్యులు కానున్నారు.
సింగరేణిలో గైర్హాజరు కార్మికులను దారిలో పెట్టే ప్రయత్నం యజమాన్యం ప్రయత్నం చేస్తోంది. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. ప్రతీ కార్మికుడు నెలలో తప్పనిసరిగా 16 మస్టర్ల కంటే ఎక్కువగా పనిచేయాలి. కావాలని పని బంద్ చేసే వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. –కొరిమి రాజ్కుమార్,
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
సింగరేణిలో డిస్మిస్డ్ కార్మికులకు కూడా మరో అవకాశం ఇవ్వాలి. కొత్తగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం గైర్హాజరు కార్మికులు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కార్మిక సంఘాల అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుండేది. –త్యాగరాజు,
ఐఎన్టీయూ రీజియన్ వైస్ ప్రెసిడెంట్
సింగరేణిలో మస్టర్ల ఫికర్
సింగరేణిలో మస్టర్ల ఫికర్


