కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించాలి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ డీడీ అశోక్ అన్నారు. ఐటీడీఏ పీఎంఆర్సీ భవనంలో లీడ్ మైండ్స్ స్పార్క్ ప్రోగ్రాంపై శనివారం హెచ్ఎంలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. శిక్షణ పొందిన ప్రధానోపాధ్యాయులందరూ వార్డెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కంప్యూటర్ థింకింగ్ నైపుణ్యం పెంచాలని సూచించారు. లీడ్ మైండ్స్ బృందం కోఆర్డినేటర్లు, ఉమా మహేష్, భీమ్రావు, ఖమ్మం డీడీ విజయలక్ష్మి, ఏసీఎంఓలు రమేష్, రాములు, జీసీడీఓ అలివేలు మంగతాయారు, ప్రమీల భాయ్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల్లో
‘ధర్తీ ఆబా’
భద్రాచలంటౌన్: భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని పీఎం ధర్తీ ఆబా కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి 15 వరకు గిరిజన సంక్షేమ శాఖ సంస్థలు, గిరిజన గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రెటరీ సర్వేశ్వర్ రెడ్డి, టీసీఆర్ అండ్ టీఐ జాయింట్ డైరెక్టర్ సమజ్వాల సూచించారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. పీఎం ధర్తీ ఆబా, ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, నాటికలు, కల్చరల్, క్రీడలు వంటి పోటీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, మ్యూజియం ఇన్చార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్రవాహనం చోరీ
అశ్వారావుపేటరూరల్: ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్రవాహనం చోరీకి గురికాగా, శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన కాసగాని ప్రసాద్ శుక్రవారం ఉదయం తన ఇంటి ద్విచక్రవాహనం నిలిపాడు. కొద్ది సేపటి తర్వాత గమనించగా ద్విచక్రవాహనం లేదు. సీసీ ఫుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ను అపహరించినట్లు రికార్డయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యయాతీ రాజు తెలిపారు.
గౌరవ వేతనం ఇవ్వాలి
సూపర్బజార్(కొత్తగూడెం): కమీషన్ కాకుండా గౌరవ వేతనం ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరుతూ లైసెన్స్డ్ సర్వేయర్లు శనివారం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్కు వినతిపత్రం అందజేశారు. వేతనం, సామాజిక భద్రత, శాశ్వత గుర్తింపు ఇవ్వాలని కోరారు. భూభారతి ఎంట్రీలు, నాలా మ్యాప్ ప్రక్రియలు, సర్వేడేటా అప్డేట్ వంటి విధులు నిర్వర్తించేందుకు తమను నియమించారని, తగిన పారితోషికం కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అట్రాసిటీ కేసు నమోదు
దమ్మపేట : కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శుక్రవారం మండలంలోని మందలపల్లి గ్రామంలో ఓ ఇంటి విషయమై తగాదా జరిగింది. గ్రామానికి చెందిన దళిత మహిళ చింతలచెరువు జయప్రదను అదే గ్రామానికి చెందిన యర్రపాటి కృష్ణవేణి, యర్రపాటి సత్యనారాయణ, యర్రపాటి సత్యవతి, యర్రపాటి వెంకటపవన్లు కులం పేరుతో దూషించారు. జయప్రదతో పాటుగా ఆమె భర్త సునీల్ను కూడా బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
ఇల్లెందు: పట్టణంలోని జేకే కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి బానోతు దుర్గను ఆమె భర్త నగేష్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించాలి
కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించాలి


