మరో ముందడుగు..
ఈ గ్రామాల్లో సేకరణ..
జిల్లా మీదుగా వెళ్తున్న రెండో జాతీయ రహదారి 930 (పీ) విస్తరణలో మరో అడుగు పడింది. నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న ఈ రోడ్డుకు సంబంధించిన భూ సేకరణకు తాజాగా మూడో నోటిఫికేషన్ను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
● ఇల్లెందు – కొత్తగూడెం మధ్య నాలుగు లేన్లతో జాతీయ రహదారి ● 2021లో ఎన్హెచ్ 930(పీ)గా అప్గ్రేడ్ ● భూసేకరణకు 2024లో నోటిఫికేషన్ల జారీ ● కొత్తగూడెం – హైదరాబాద్ మధ్య తగ్గనున్న 40 కి.మీ.
తగ్గనున్న దూరం..
కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు చేరుకునే ప్రధాన మార్గం ప్రస్తుతం ఖమ్మం – సూర్యాపేట మీదుగానే ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా కొత్తగూడెం నుంచి ఇల్లెందు, మహబూబాబాద్, తొర్రూరు మీదుగా హైదరాబాద్ (గౌరెల్లి జంక్షన్)వరకు కొత్తగా మరో జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ రోడ్డును నేషనల్ హైవే–930(పీ)గా పేర్కొంటూ 2021లో గెజిట్లో ప్రకటించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కొత్తగూడెం – హైదరాబాద్ మధ్య 40 కి.మీ. వరకు దూరం తగ్గుతుంది. జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద మొదలయ్యే ఈ రోడ్డు ఇల్లెందు మండలం నెహ్రూనగర్ వరకు 52 కి.మీ. నిడివితో ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.700 కోట్లతో ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశారు.
గతంలోనే నోటిఫికేషన్..
ఇల్లెందు – కొత్తగూడెం మధ్య వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రోడ్డు విస్తరణ ఎక్కడి వరకు ఉంటుందనే మార్కింగ్ కూడా రెండేళ్ల క్రితమే పూర్తయింది. అందుకు తగ్గట్టుగానే జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో రెండుసార్లు భూ సేకరణకు సంబంధించి 3ఏ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇక రోడ్డు విస్తరణలో నష్టపోయే చెట్లను గుర్తించే పనిని అటవీశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది. కాగా, మొదటి రెండు నోటిఫికేషన్లలో పేర్కొనని స్థలాలకు సంబంధించి.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా – నాయ్) నుంచి గత అక్టోబర్ 23న మూడోసారి 3ఏ నోటిఫికేషన్ వెలువడింది.
ప్రక్రియ పూర్తయితే..
జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం ఏదైనా రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా తెలియజేస్తూ ముందుగా 3ఏ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ తర్వాత ఆ భూముల్లో సర్వే చేయడానికి 3బీ, అభ్యంతరాలు స్వీకరించడానికి 3సీ, స్వాధీన ప్రకటనకు 3డీ, స్వాధీనం చేసుకునేందుకు 3ఈ, 3ఎఫ్ నోటిఫికేషన్లు, నష్ట పరిహారం ప్రకటనకు 3జీ, చెల్లింపులకు 3హెచ్.. ఇలా 3ఎల్ వరకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. మూడుసార్లు జారీ అయిన నోటిఫికేషన్లతో భూసేకరణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్టే. ఆ తర్వాత అటవీ శాఖ నుంచి అనుమతులు వస్తే టెండర్ల ప్రక్రియకు వెళ్లడమే తరువాయి అనే పరిస్థితి నెలకొంది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇల్లెందు మండల పరిధిలో 178 కి.మీ. నుంచి 189 కి.మీ. సెక్షన్లో సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధిలో 12 వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న స్థలాలను హైవే కోసం తీసుకోనున్నారు. అలాగే 196 కి.మీ. నుంచి 230 కి.మీ. వరకు గల సెక్షన్లో టేకులపల్లి మండలం బేతంపూడిలో రెండు సర్వే నంబర్లు, గొల్లపల్లిలో నాలుగు సర్వే నంబర్లలో ఉన్న భూమిని సేకరిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామపంచాయతీ పరిధిలో 16 సర్వే నంబర్లలో ఉన్న స్థలాలను ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మరో ముందడుగు..


