సఖి సురక్షతో మహిళలకు మేలు
రేపల్లె: స్వయం సహాయ సంఘాల మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన సఖి సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు కోరారు. పట్టణంలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాలులో మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష వైద్యశిబిరం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శిబిరంలో 35 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలకు 16 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్యులు సురేందర్, హరిప్రసాద్, ఆయుష్, నీలిమ, శ్రావణి పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు చేశారు. కార్యక్రమంలో మెప్మా డీపీఎం బాబు, సీఓ రాజేంద్ర, టీఎల్ఎఫ్ లక్ష్మీ నరసమ్మ, నాగలీల, జయప్రద, టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): సంపూర్ణ ఆరోగ్య మహా సూత్రమే యోగా అని యోగా శిక్షకుడు వంగా వెంకటేష్ తెలిపారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సంక్లిష్టమైన కరోనా సమయంలో యోగా సాధకులు అధిక సంఖ్యలో అకాలమరణం పాలు కాకుండా జీవించడానికి కారణం యోగా సాధనే అని తెలిపారు. రోజుకు కనీసం 45 నిమిషాలైనా యోగా, మెడిటేషన్ సాధన చేస్తే జీవన కాలాన్ని అతి సులభంగా పెంచుకోవచ్చని పేర్కొన్నారు. జాయ్అండ్ షైన్ వెల్నెస్ సెంటర్ ఫిటెనెస్ కోచ్ కె.జ్యోతి శ్యామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణా శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం యోగా శిక్షణతోపాటు ఫిట్నెస్, చక్కని ఆరోగ్యం తదితర అంశాలపై ప్రముఖులతో పాఠాలు చెప్పిస్తామన్నారు. అనంతరం యోగా తరగతులను వెంకటేష్ నిర్వహించారు. అయితి సతీష్, భావన్నారాయణ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ యానీ అమల, శైలజ, సల్మా, సంధాని, వెంకాయమ్మ పాల్గొన్నారు.
సఖి సురక్షతో మహిళలకు మేలు


