పలు బ్యాంక్ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన
నెహ్రూనగర్: అమరావతిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్కు రాష్ట్ర వ్యాప్తంగా 1,351 శాఖల ద్వారా ఒక కోటి ముఫ్పై లక్షల ఖాతాదారులకు నాణ్యతతో కూడిన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ, రాష్ట్రంలో అగ్రగామి బ్యాంకుగా ఎదుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం గుంటూరు బ్రాడీపేటలో పనిచేస్తోందని, అమరావతిలో కేటాయించిన స్థలానికి నిర్మాణ అనుమతులు రాగానే నూతన భవన నిర్మాన పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
అమరావతిలో
సెంట్రల్ బ్యాంకు కార్యాలయానికి..
తాడికొండ: అమరావతిలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోసం కేటాయించిన స్థలంలో భూమిపూజ, నిర్మాణానికి పనులు శుక్రవారం నిర్వహించారు. ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం అమరావతిలో సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోసం కేటాయించిన భూమిలో బ్యాంకు ఎండీ, సీఈఓ కళ్యాణ్కుమార్, జోనల్హెడ్ దారా సింగ్నాయక్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు భూమి పూజ నిర్వహించిన అనంతరం శంకుస్థాపన శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమరావతిలో మరింత విస్తరణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇది ఒక ప్రధాన అడుగుగా అభివర్ణించారు. కార్యక్రమంలో రీజనల్ హెడ్ విజయవాడ పి.సతీష్బాబు, కడప రీజనల్హెడ్ ఈ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పలు బ్యాంక్ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన


