ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
మంగళగిరి టౌన్: ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టురట్టయింది. మంగళగిరిలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 ల్యాప్టాప్లు, 32 సెల్ఫోన్లు, 22 బ్యాంక్ ఖాతా పుస్తకాలు, 11 చెక్ బుక్కులు, 30 ఏటీఎం కార్డులతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నార్త్ సబ్డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ శనివారం వెల్లడించారు. మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామం ఎన్ఆర్ఐ ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్వీఎన్ రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందంటూ సమాచారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో 17వ తేదీ సాయంత్రం దాడిచేశారు. ఫ్లాట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న కొక్కిలిగడ్డ యేసన్నను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అక్కడేఉన్న బాలు, ప్రవీణ్, సూర్య అనే ముగ్గురు పారిపోయారు. ఈ ముగ్గురితో పాటు మనో (మనోహర్)ను మంగళగిరి ఎన్ఆర్ఐ వై.జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఫేక్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేస్తూ బెట్టింగ్ వెబ్సైట్కు లింక్ చేసి క్రికెట్ బెట్టింగ్ద్వారా ఆర్ధిక నేరాలకు బెట్టింగ్ ముఠా సభ్యులు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో మనో (మనోహర్)ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు పలువురి ఆధార్ కార్డులు సేకరించి, వారిపేరుపై సిమ్ కార్డులు తీసుకుని, పలు బ్యాంకుల్లో సుమారు 30 ఖాతాలు ఓపెన్ చేశాడు. ఈ పని చేయడం కోసం ఎన్ఆర్ఐ వెనుక ప్లాట్ను అద్దెకు తీసుకుని సూర్యప్రకాష్, ప్రవీణ్, బాలు, యేసన్నలను తన దగ్గర జాబ్ ఉందంటూ పెట్టుకున్నాడు. ఈ వ్యవహారాన్ని నడిపే క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి చాకచక్యంగా తొలుత ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించి మిగిలిన వారిని అరెస్ట్ చేశారు. వారి బ్యాంకులావాదేవీల నుంచి రూ.6.30లక్షలను బ్లాక్ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ వెంకట్, పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐ సిహెచ్ వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.


