
ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్ల
బాపట్ల: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర‘ కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాన్ని వివరిస్తూ అవగాహన ర్యాలీని శనివారం పట్టణంలో నిర్వహించారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా చెత్త డంపింగ్ యార్డు వద్దకు చేరుకున్న విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్తో కలిగే నష్టాన్ని వివరించారు. విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్, బాపట్ల శాసనసభ్యుడు కలసి పారిశుద్ధ్య కార్మికులను పుష్పమాలతో సత్కరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా వినియోగాన్ని పూర్తిగా నిలిపి వేయాలని బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. బుడ చైర్మన్ సలగాల రాజశేఖర్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి, పురపాలక సంఘం ప్రత్యేక అధికారి జి.గంగాధర్ గౌడ్, డీపీఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఆర్డీవో గ్లోరియా, సీపీఓ షాలేమ్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులుపాల్గొన్నారు.
పీ 4 విధానంతో పేదలకు మేలు
నిరుపేద కుటుంబాలను పీ4 విధానం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. నందిరాజు తోట గ్రామసభకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందిరాజు తోట, హైదరపేట గ్రామాలలో 106 మందిని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సీపీఓ షాలేమ్ రాజు, బీసీ సంక్షేమ అధికారి శివలీల, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, ఎంపీడీవో బాబురావు తదితరులు పాల్గొన్నారు.
అందరి సహకారంతో తీర్చిదిద్దుదాం జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
చివరి ఆకు వరకు కొంటాం
పర్చూరు(చినగంజాం): నల్ల బర్లీ పొగాకును చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ జె. వెంకట మురళి సూచించారు. పర్చూరులో పొగాకు కొనుగోలు కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. పొగాకు కొనుగోలుకు సంబంధించి రైతులతో ఆయన మాట్లాడారు. కొనుగోలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. పొగాకు కంపెనీలు రైతుల వద్ద పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేయడంతో ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు రూ. 25 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసినట్లు తెలిపారు. వర్షాలకు పొగాకు తడవకుండా కాపాడుకోవాలని సూచించారు. సోమవారం నుంచి ప్రతి రోజూ 900 టన్నుల పొగాకును కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పొగాకు బేళ్లు 30 కంటే తేమశాతం తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ పి. బ్రహ్మయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ గుంజి వెంకట్రావు, మార్క్ఫెడ్ అధికారులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.