
చంద్రబాబూ.. నిస్సిగ్గు మాటలు ఆపు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం
మీకు, మీ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి
76 వేల రైతు కుటుంబాలకు మామిడి ధర సమస్య
మీ కంటికి ఆ రైతులు రౌడీలు, దొంగల మాదిరిగా కనిపిస్తున్నారా?
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, అమరావతి: రైతుల పక్షాన మేం నిలబడితే ఎల్లో మీడియా దౌర్భాగ్యపు రాతలు రాయడం ఏమిటి? అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్లుగా... వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు, సంబరాలు చేసుకుంటున్నట్టు రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబూ ..! రైతులకు మీరు నిజంగానే మేలు చేస్తే మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీ ఎందుకు పంపారు’ అని ప్రశ్నించారు. బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను ఓదార్చి భరోసా కల్పించడంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ గురువారం స్పందించారు. చంద్రబాబు సర్కారుకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మామిడి రైతులపై పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...
పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలి
సీఎం చంద్రబాబూ...! మీరు, మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 సహా మీకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా మరింతగా దిగజారిపోయాయి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వందల మందిని నోటీసులతో నిర్బంధించినా.. అణచివేతలకు దిగినా.. చివరకు లాఠీఛార్జీ చేసినా వెరవకుండా తమ గోడు చాటుతూ బుధవారం బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నేను నిర్వహించిన పర్యటనకు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వం తీరుపట్ల రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు తమకు తీవ్ర నష్టం వచ్చినా, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది నేరమన్నట్లుగా.. తమ కష్టాలు చెబుతున్న రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగా, అసాంఘిక శక్తులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ, వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లో మీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడటం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజాన మోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న చులకన భావానికి, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు! ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబూ..! పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి! పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకు సిగ్గు ఉండాలి!
సమాధానం చెప్పలేక తప్పుడు రాతలా
వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజూ ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25 – 29 మధ్య ధర లభించింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎందుకు పడిపోయాయి? ఏటా మే 10 – 15 మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను ఈ ఏడాది ఎందుకు తెరవలేదు? నెల రోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవి కూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలంలో ఫ్యాక్టరీలు తెరవకపోయినా మీరు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబూ? ఒకేసారి సరుకు వచ్చేలా చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్లు కాదా?
మీ గల్లా ఫ్యాక్టరీ, శ్రీని ఫుడ్స్.. ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా? అసలు మీరు ఇస్తానన్న కిలోకి రూ.4 ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8 చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? నిరుడు వైఎస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29 రేటు? ఈరోజు అమ్ముకుంటున్న కిలోకి రూ.2.5 – రూ.3 ఎక్కడ? ప్రతిపక్ష నేతగా, రైతుల పక్షాన బుధవారం బంగారుపాళ్యంలో దీన్ని నిలదీసే కార్యక్రమం నిర్వహిస్తే మీ దగ్గర సమాధానం లేక రైతుల మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?
రైతులు నష్టపోయినట్లు ఒప్పుకుంటూనే దౌర్భాగ్యపు మాటలు, రాతలా?
నిజంగానే మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే.. రైతులు పంటను తెగనమ్ముకోకపోతే.. మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయాన్ని పక్కనపెడితే.. కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? పల్ప్ ఫ్యాక్టరీలు కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలు ఎందుకు జారీ చేశారు? కర్ణాటకలో కిలో రూ.16 చొప్పున కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్లు ఒకవైపు మీరు అంగీకరిస్తూనే ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎలుగెత్తితే మళ్లీ ఈ దౌర్భాగ్యపు మాటలు, రాతలు ఏమిటి? ఈ ఆంక్షలు ఎందుకు?గల్లా, శ్రీని ఫుడ్స్కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా..?

రైతాంగానికి అండగా నిలిస్తే రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలా..
మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే... రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగీ, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీ దృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు...!! అంతేకదా చంద్రబాబూ...? వీరికి ఏ సమస్యా లేదని, అన్ని హామీలను మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకుని వీరంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం! కనీస మద్దతు ధర దక్కడం లేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా వీళ్లంతా అసాంఘిక శక్తులు కాబట్టి రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం? ఇదేం పద్ధతి? ఇదేం విధానం చంద్రబాబూ..?
ఒక్క కిలో అయినా కొన్నారా
గిట్టుబాటు ధరలు రావడం లేదని మిర్చి రైతులు గగ్గోలు పెట్టినా ఒక్క కిలో అయినా కొన్నారా చంద్రబాబూ..? మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి... ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడం లేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారు. మిర్చి రైతులు ధరలు రావడం లేదని ఆక్రోశిస్తే కేంద్రం చేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? పొగాకు రైతులు ఆందోళన చేస్తే ఇంకో డ్రామా చేస్తూ ప్రకటనలు చేయిస్తున్నారు. రైతుల సంక్షేమంపై మీరు ఏనాడైనా చిత్తశుద్ధితో వ్యవహరించారా?
మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20 వేలు ఇవ్వలేదు
మీరు ఇస్తానన్న రైతు భరోసా (అన్నదాతా సుఖీభవ) రూ.20 వేలు ఇంతవరకూఇవ్వలేదు. గతేడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదీ ఇప్పటివరకు దిక్కులేదు. ఈ ఏడాది జూన్ 21కి ఇస్తానని చెప్పి, జూలై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ దాని గురించి ప్రస్తావించడం లేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్య గోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.
రైతులు నష్టపోతున్నా ఆ పని ఎందుకు చేయడం లేదు
మా ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పని చేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే విషయంపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే సీఎం యాప్ ఏమైంది?
ఇన్పుట్ సబ్సిడీ గాలికి వదిలేశారు
వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని మీరు గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎత్తేశారు. ఆర్బీకేలు, ఈ–క్రాప్ విధానం, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్ను నాశనం చేస్తున్నారు. రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎండగడితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.