ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యలో రెవెన్యూ సంఘాల చేరిక
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యలో రెవెన్యూ సంఘాలు చేరాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమక్షంలో వివిధ సంఘాల నేతలు చేరారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, బొప్పరాజు సంఘానికి బలం లేదన్నారు. బొప్పరాజు వెంట 5వేల మంది ఉద్యోగులైనా లేరని, ఆయన వల్ల తెగేది లేదు.. తెల్లారేది లేదని వెంకట్రామిరెడ్డి అన్నారు.
‘‘ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించిన చరిత్ర బొప్పరాజుకు లేదు. మాటలు చెప్పుకుంటూ కాలం గడపడమే ఆయనకు తెలుసు. ఉద్యమించడం బొప్పరాజుకు చేతకాదు’’ అంటూ వెంకట్రామిరెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యతోనే ఉద్యోగులకు మేలు: దివాకర్
వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో కలిసి పనిచేస్తామని రెవెన్యూ జేఏసీ ప్రతినిధి దివాకర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యతోనే ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు.
ఆ సంఘాలతో మాకు సంబంధం లేదు: చిరంజీవీరావు
సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిరంజీవిరావు మాట్లాడుతూ, బొప్పరాజు నేతృత్వంలోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్లతో కలిసి గతంలో పని చేశామని, ఆ అసోసియేషన్లు మమ్మల్ని ఉపయోగించుకున్నారు కానీ.. మాకు ఉపయోగపడ లేదన్నారు. ఇప్పుడు ఆందోళనలు.. ధర్నాలు చేస్తున్న సంఘాలతో తమకు సంబంధం లేదని, బొప్పరాజు వల్ల తమకు అన్యాయమే జరిగిందని చిరంజీవిరావు అన్నారు.
చదవండి: నూతన పార్లమెంటు భవనం ప్రారంభంపై సీఎం జగన్ ట్వీట్