3,335 పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే 3,335 గ్రామాల్లో మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఆయా గ్రామాల రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేసి.. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపడతారు. 3,335 గ్రామ సర్పంచ్ పదవులతో పాటు ఆ గ్రామాల పరిధిలో గల 33,632 వార్డు పదవులకు కూడా అదే సమయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుంది.
తొలి విడతలో సర్పంచ్ పదవులకు 19,491 నామినేషన్లు
తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 3,251 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవులకు 19,491 నామినేషన్లు దాఖలు కాగా, ఆయా గ్రామాల పరిధిలో 32,522 వార్డు పదవులకు 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి.