బాబు జూమ్ మీటింగ్లపై నేతల అసంతృప్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి, టీడీపీ కేడర్కు దూరంగా హైదరాబాద్లో ఉంటున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికి వచ్చినా అదే తీరు కొనసాగిస్తుండటంపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని నెలల నుంచి పార్టీ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఆయన అమరావతికి వచ్చినా అదే ఆన్లైన్ను నమ్ముకోవడం ఏమిటని పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రెండురోజుల క్రితం ఏపీకి వచ్చిన ఆయన ఉండవల్లిలోని తన నివాసంలోనే గడుపుతున్నారు. ఇంట్లో నుంచే ‘జూమ్’ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు వచ్చారని పలువురు పార్టీ నాయకులు కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లినా లోనికి రానీయడం లేదు. పార్టీ నాయకులు ఎవరూ రావద్దని రాష్ట్ర కార్యాలయం నుంచి సమాచారం ఇస్తున్నారు. ఏ విషయమైనా టెలీ, జూమ్ వీడియో కాన్ఫరెన్స్లలోనే మాట్లాడాలని, నేరుగా కలవకూడదని చెబుతున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీ సీనియర్ నాయకులకూ ఇదే సమాధానం రావడంతో వారు నిరుత్సాహంలో మునిగిపోయారు. ఈ మాత్రం దానికి ఉండవల్లి రావడం దేనికని పార్టీలో పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా తేడా లేదంటున్నారు. ఏపీకి వచ్చానని చెప్పుకోవడానికి తప్పితే ఈ పర్యటన వల్ల ఉపయోగం లేదని, అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న వారిని ఊరడించేందుకే ఏపీకి వచ్చినట్లు చంద్రబాబు కలరింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు.