18న పుణెలో పోలవరం నమూనా డిజైన్ల పరిశీలన
సీడబ్ల్యూపీఆర్ఎస్కు డీడీఆరీ్ప, పీపీఏ, రాష్ట్ర జలవనరుల అధికారులు
3–డీ విధానంలో నిర్మించిన నమూనా పోలవరం ప్రాజెక్టు పరిశీలన
అధిక ఒత్తిడులతో నీటిని పంపే ప్రయోగాలను విశ్లేషించనున్న నిపుణులు
వాటి ఆధారంగా డిజైన్ ఖరారు.. మిగిలిన డిజైన్లకూ ఇదే విధానం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలోకి అధిక ఒత్తిడితో నీటిని పంపినప్పుడు ఏర్పడే పరిణామాల ఆధారంగా కీలకమైన డిజైన్లను ఖరారు చేయాలని కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖల నిపుణుల బృందం నిర్ణయించింది. అందులో భాగంగా పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన నమూనాను ఈ నెల 18న పరిశీలించనున్నారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో కూడిన నిపుణుల బృందం పుణెకు వెళ్లనుంది. నమూనా పోలవరం ప్రాజెక్టుపై సీడబ్ల్యూపీఆర్ఎస్ అధికారుల బృందం చేసిన ప్రయోగాలు.. వాటి ఫలితాలను విశ్లేషించనుంది. ఈ విశ్లేషణల ఆధారంగా ఈనెల 19, 20, 21న పోలవరం జలాశయం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పెండింగ్లో ఉన్న డిజైన్లకు తుదిరూపు ఇచ్చి సీడబ్ల్యూసీకి పంపి, ఆమోదింపజేయనుంది.
గడువులోగా పూర్తికి ప్రభుత్వం అడుగులు
ఖరీఫ్, 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెండింగ్లో ఉన్న డిజైన్లను యుద్ధప్రాతిపదికన ఆమోదింపజేసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దాంతో పెండింగ్లో ఉన్న డిజైన్లను వేగంగా ఖరారు చేయాలని డీడీఆరీ్పని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి కోరారు. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్టును నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్ను ఆమోదించింది. సిŠప్ల్ వే మీదుగా వరద ప్రవాహాన్ని మళ్లించడానికి తవ్వుతున్న అప్రోచ్ చానల్కు గైడర్ వాల్ను నిర్మించాలి. ఈ గైడర్ వాల్ డిజైన్ అత్యంత కీలకం. ఇప్పటిదాకా ఈ డిజైన్ను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు.
పుణెలో పరిశీలన తర్వాత క్షేత్రస్థాయి పర్యటన
సీడబ్ల్యూపీఆర్ఎస్లో నిర్మించిన నమూనా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే మీదుగా అధిక ఒత్తిడులతో నీటిని పంపినప్పుడు ఆ నీటి ఉధృతి ఎలా ఉందన్నది విశ్లేషించి, దాని ఆధారంగా క్షేత్ర స్థాయిలో పోలవరం పనులను పరిశీలించి, గైడర్ వాల్ డిజైన్కు నిపుణుల బృందం తుదిరూపు ఇచ్చి సీడబ్ల్యూసీకి పంపనుంది. స్పిల్ వే నుంచి విడుదల చేసిన వరద నీరు స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. నదిలో వరద నీరు కలిసినప్పుడు ఆ ప్రభావం కుడి గట్టు (పురుషోత్తపట్నం)పై పడుతుంది. వరద ఉధృతికి తట్టుకునేలా పురుషోత్తపట్నం గట్టును పటిష్టం చేయడానికి సంబంధించిన డిజైన్ను నిపుణుల బృందం ఖరారు చేయనుంది. ఇదే పద్ధతిలో పెండింగ్లో ఉన్న 29 డిజైన్లకు తుదిరూపు ఇచ్చి.. సీడబ్ల్యూసీకి పంపనుంది. సీడబ్ల్యూసీ వాటిని లాంఛనంగా ఆమోదిస్తుంది.