హైకోర్టు ఆదేశించినా.. వారు వేధిస్తున్నారు..
హైకోర్టు ఎదుట ఓ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, అమరావతి: తమ స్థలం విషయంలో హైకోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చినా.. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కొందరు బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా ధూళిపాళ్లకు చెందిన భార్యాభర్తలు దేవేంద్రరావు, భానుశ్రీలు సోమవారం హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
గ్రామంలో తమకున్న స్థలంలో 1997 నుంచి నివాసం ఉంటున్నామని, 2003లో ప్రభుత్వం పట్టా ఇచ్చిందని దేవంద్రరావు చెప్పారు. ఆ స్థలంలో బస్టాండ్ నిర్మించాలని చూస్తే దానిపై తాము 2017లో హైకోర్టులో పిటిషన్ వేశామని, తమకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు హైకోర్టు ఆర్డర్ చెల్లదంటూ రోజూ వేధిస్తున్నారని, స్థలాన్ని ఖాళీ చేయాలంటూ బెరిస్తున్నారని దేవేంద్రరావు వివరించారు.