10,555 మంది డిశ్చార్జ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కోవిడ్ కేసుల కంటే డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,555 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 68,829 టెస్టులు చేయగా, 7553 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ కారణంగా 51 మంది మృతి చెందారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 52,29,529 టెస్టులు చేయగా, 6,39,302 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,62,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 71,465 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించినవారి సంఖ్య 5,461కి చేరింది. మిలియన్ జనాభాకు 97,931 టెస్టులు చేస్తూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.