80 శాతం దాటిన రికవరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 80.40 శాతానికి చేరింది. దేశంలో ఏడు రాష్ట్రాల్లో మాత్రమే రికవరీ రేటు 80 శాతం దాటగా అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 70,993 టెస్టులు చేయగా, 10,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 73 మంది మృతి చెందారు. ఒకే రోజు 11,691 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 42,37,070 టెస్టులు చేయగా, 5,17,094 పాజిటివ్లు వచ్చాయి. వీరిలో 4,15,765 మంది కోలుకోగా, 96,769 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,560కి చేరింది. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 79,346 పరీక్షలు చేస్తూ ఏపీ.. దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది.