రాష్ట్రానికి ఆదాయ వనరులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి ఆదాయం అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‘‘రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై దృష్టి సారించాలి. వారానికి ఒకసారి అధికారులు సమావేశం కావాలి. ప్రతి ఏటా సహాజంగా పెరిగే ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఆదాయ వనరులపై వినూత్న సంస్కరణలు తీసుకురావాలి. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలి’’ అని అధికారులను ఆదేశించారు.
‘‘మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలి. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపండి. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నాం. దీనివల్ల సరిహద్దులనుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నాం:. ఇలాంటి వ్యవహారాలపై కచ్చితంగా ఉక్కుపాదం మోపాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.