AP Assembly: టీడీపీ సభ్యులపై సీఎం జగన్ సీరియస్
టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనతో గవర్నర్కు అవమానం
రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అనుచిత ప్రవర్తనతో టీడీపీ సభ్యులు.. గవర్నర్ను అవమానించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. సీఎం తన ప్రసంగంలో ఏమన్నారంటే..
గవర్నర్ను అవమానించడం దారుణం:
ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. ఇది కొత్త సంప్రదాయం కాదు. ఎప్పటి నుంచో ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. అందులో ఏమైనా అంశాలపై విభేదించాలనుకుంటే, విపక్షానికి సమయం ఇస్తారు. ఇవాళ టీడీపీ పక్షాన రామానాయుడుగారు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో విభేదించాలనుకుంటే ఇది ఒక అవకాశం. వాస్తవానికి చంద్రబాబు సభకు రావాల్సి ఉంది. ఆయనను రావొద్దని మేము చెప్పలేదు. కానీ ఆయనకు ముఖం లేక రావడం లేదు.
రాజ్యాంగ వ్యవస్థపై ఆయనకు గౌరవం లేదు:
గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. ఆయన రాష్ట్రానికి పెద్ద. పైగా వయసులోనూ చాలా పెద్ద. 87 ఏళ్లు. ప్రొటొకాల్లో మొదటి స్థానంలో ఉంటారు. ఆయనను అవమానపర్చడమే కాకుండా, దాదాపు దాడి చేసినంత పని చేశారు. మేము విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. ప్రసంగం తర్వాత గవర్నర్ తిరిగి వెళ్తున్నప్పుడు కూడా నినాదాలు చేశారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థ అంటే చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో లేడు కాబట్టి. గవర్నర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అయినా ఆయనను దారుణంగా అవమానించారు. 87 ఏళ్ల వయసున్న ఒక పెద్దాయన మీద, చంద్రబాబు సభకు రాకపోగా, తన పార్టీవారిని, తన కొడుకును అక్కడ నిలబెట్టి చాలా అవమానించారు. దిగజారి వ్యవహరించారు.
చదవండి: సర్కారు బడుల్లో.. సీబీఎస్ఈ పాఠాలు
వారికి సూటిగా ఒక ప్రశ్న:
టీడీపీ వారిని నేను నేరుగా ఒక ప్రశ్న అడగదల్చాను. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబుగారు చేసిన మేలు ఏమిటి? ఆయన పరిపాలన 5 ఏళ్లు చూసిన తర్వాత.. ఇవాళ్టికీ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే కనీసం ఒక్క సంక్షేమ పథకం అయినా ఉందా? ఒక్కటంటే ఒక్కటైనా మంచి పని చేశారా? ఇప్పుడు మా సభ్యులంతా చెబుతున్నారు. చంద్రబాబు పేరు చెబితే, ఒక పథకం.. వెన్నుపోటు గుర్తుకు వస్తుందని. చంద్రబాబు తన జీవితంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక వాటికి ఇచ్చిన విలువ ఏమిటో అందరికీ తెలుసు. అదే మన ప్రభుత్వం.. ఎన్నికల వాగ్దానాలకు ఎలాంటి విలువ ఇస్తున్నామో దాదాపు 34 నెలల పాలనలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు.
సుపరిపాలన. అందుకే..:
చంద్రబాబు పాలనకు మన పాలనలో తేడాను చూస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలను గెల్చుకుంది. ఇప్పటి వరకు మనం ఎలాంటి పాలన చూస్తే.. దానికి ఉదాహరణ. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ, చివరకు కుప్పంతో సహా, గత ఏడాది నవంబరులో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పాటు, కార్పొరేషన్ల ఎన్నికలు, తిరుపతి ఎంపీ, బద్వేల్ ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మండల, జడ్పీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు.
87 మున్సిపాలిటీలలో వైఎస్సార్సీపీ 84 చోట్ల గెల్చింది. వాస్తవానికి 85 చోట్ల గెల్చాం. కానీ కోర్టు ఆదేశం వల్ల తీర్పు వెలువరించలేదు. 12 కార్పొరేషన్లు, 13 జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం వైఎస్సార్సీపీ గెల్చింది. అదే విధంగా 9,702 ఎంపీటీలకు ఎన్నికలు జరిగితే 8,298 అంటే 86 శాతం వైయస్సార్సీపీ గెల్చింది. అలాగే 652 జడ్పీటీసీల ఎన్నికలు జరిగితే 639 చోట్ల, అంటే 98 శాతం వైఎస్సార్సీపీ గెల్చింది. 648 ఎంపీపీల ఎన్నికలు జరిగితే 639, అంటే 98.6 శాతం వైఎస్సార్ కాంగ్రెస్ గెల్చుకుంది.
చదవండి: సోషల్ మీడియా కార్యకర్తలకు గుర్తింపు
ప్రజలే ప్రశ్నించారు:
ఇంతలా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్కు ఓటు వేశారంటే, ఆ స్థాయిలో వాళ్లు తీర్పు ఇస్తూ, ప్రజలు చంద్రబాబుగారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. చంద్రబాబు మీరు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ప్రజలు అడిగారు. దాదాపు ఈ 3 ఏళ్ల పాలనతో కోవిడ్ సహా, ప్రపంచమే ఊహించని కష్టాలు ఎదురైనా ఆర్థిక పరిస్థితుల తలకిందులు అయినా, జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చారు. మేనిఫెస్టోలో 95 శాతం వాగ్దానాలు నిలబెట్టుకున్నాం. అందుకే ప్రజలు ఆశీర్వదించారు. మరోసారి అడుగుతున్నాను. దీని అర్ధం మీ గత వికృత పాలనను, మీ ప్రస్తుత వైఖరికి ప్రజలు ఛీకొడుతూ ఇచ్చిన తీర్పు ఇది.
పోల్చి చూడండి:
ఏ ఒక్క గ్రామాన్ని అయినా తీసుకున్నా, ఏ ఒక్క పేద కుటుంబాన్ని తీసుకున్నా 2014 నుంచి 2019 వరకు.. ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి పోల్చి చూడమని ప్రజలను అడుగుతున్నాను. ఏ ఒక్క మున్సిపాలిటీ అయినా సరే, చివరకు కుప్పం అయినా సరే. అలాగే ఏ జల్లా అయినా తీసుకొండి. పోల్చి చూసుకొండి. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని అయినా తీసుకుని, ఎవరి హయాంలో ఎంత మేలు జరిగిందో అడగండి. ఏ ఒక్క రంగాన్ని అయినా తీసుకోండి. వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సాధికారత కావొచ్చు, పరిపాలనా సంస్కరణలు కావొచ్చు, గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్న మార్పులు.. ఇలా ఏ రంగం తీసుకున్నా, టీడీపీ చేసిన చెడు కనిపిస్తుంది. మన ప్రభుత్వం చేస్తున్న మంచి కనిపిస్తుంది.
వాస్తవాలు తెలియకూడదనే..:
చంద్రబాబుని నేను నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ చర్చ చేయలేకనే, గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేయడం, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా భ్రమ కల్పించడమే ఇవన్నీ.
సమాధానం చెప్పగలరా?:
చంద్రబాబుకి మరో ప్రశ్న. ఆయన పాలనలో ఏ పథకానికి అయినా కులం, మతం, వర్గం చూడకుండా శాచురేషన్ పద్ధతిలో అమలు చేశారా? ఏ పథకాన్ని అయినా కూడా లంచం లేకుండా ఇచ్చారా? ఇవాళ ప్రజలకు కావాల్సింది జన్మభూమి కమిటీలా? లేక అవినీతి లేని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థనా? ప్రతి నెల ఒకటో తేదీన ఆదివారం అయినా సరే, పండగ అయినా సరే, ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడాన్ని మీరు ఏనాడైనా ఆలోచన చేశారా? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, అంటే జనవరి వరకు చంద్రబాబు పెన్షన్గా ఇచ్చింది నెలకు రూ.1000 మాత్రమే.
మారుతున్న గ్రామ స్వరూపం:
మన గ్రామమే తీసుకుంటే ప్రతి 2 వేల మందికి పౌర సేవలందించే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అక్కడ 10 మంది యూనిఫామ్తో చిరునవ్వుతో సేవలందించడం కనిపిస్తుంది. అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే, రైతులకు విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు రైతుకు తోడుగా నిల్చే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు వేస్తే నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. అక్కడే 24-7 బీఎస్సీ చదివిన నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. వారికి గ్రామాల బాధ్యత.
ఇంకా అదే గ్రామంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్. ఒక గ్రామ రూపురేఖలు మారుతున్నాయి అనడానికి నిదర్శనం. అదే గ్రామంలో కడుతున్న డిజిటల్ లైబ్రరీలు. ఇంకా అక్కడే మెరుగులు దిద్దుకుంటున్న అంగన్వాడీలు. ఫౌండేషన్ స్కూళ్లుగా మార్పు కనిపిస్తుంది. ఇవన్నీ గ్రామస్థాయిలో జరుగుతున్న మార్పులు. అలాగే ప్రతి మండలంలో 108 సర్వీస్. రెండు పీహెచ్సీలు. వాటిలో ఇద్దరు చొప్పున వైద్యులు. 104 సర్వీస్లు. కేవలం 34 నెలల కాలంలో మన ప్రభుత్వం మార్చిన, మారుస్తున్న గ్రామ స్వరూపం ఇది. కానీ చంద్రబాబుకి గ్రామం అంటే అభిమానం, ప్రేమ లేదు. ప్రజల స్వభావం తెలుసుకునే తత్వం లేదు.
జిల్లాలూ మారుతున్నాయి. అందుకే..:
జిల్లాల స్వరూపం కూడా మారుతోంది. ప్రతి ఆరు నుంచి 8 నియోజకవర్గాలకు ఒక జిల్లా ఏర్పాటు కానుంది. ఇది ప్రభుత్వ విజన్కు మరో నిదర్శనం. కొత్త జిల్లాలతో చేస్తున్న పరిపాలనా వికేంద్రీకరణ. దీంతో రాజధాని వికేంద్రీకరణ వద్దంటున్న వారు కూడా తమకు జిల్లా కేంద్రం కావాలని కోరుతున్నారు. చివరకు బాబుగారి బావమరిది కూడా ఆయనను కాకుండా మనల్ని అడుగుతున్నారు. చివరకు బాబుగారు కూడా కుప్పంలో రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నాడంటే, ఎవరికి ఎంత విజన్ ఉందో ప్రజలకు అర్ధం అవుతుంది
అందరి గురించి ఆలోచన లేదు:
రాజధాని వికేంద్రీకరిస్తామంటే మా భూములు, మా వారి భూములు, వాటి ధరలు తప్ప, ప్రజల ఆకాంక్ష, ఆలోచన. మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి వంటివి ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఇక్కడ మనం చట్టాలు చేస్తాం. ప్రజల సభలో తీసుకున్న నిర్ణయాలు.. అది ఇంగ్లిష్ మీడియం కావొచ్చు. పేదలకు ఇళ్ల స్థలాలు కావొచ్చు. రాజధాని అయినా కావొచ్చు. ఏ కోర్టులో అయినా వ్యతిరేకంగా తీర్పు వస్తే సంతోషపడేది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు. ఎందుకంటే కేసులు వారే వేయిస్తారు.
నాడు సంక్లిష్ట నిర్ణయాలు:
ఈ సంక్లిష్టమైన చంద్రబాబు నిర్ణయాలకు, రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు, వారి భవిష్యత్తుకు, మనం చేస్తున్న ఆలోచనలకు ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించండి. గవర్నమెంట్ బడిని చంపేయాలని గతంలో బాబు చేయని ప్రయత్నం లేదు. ఆయన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు చాలా మూసేశారు. వాటిని బతికించడమే కాకుండా, వాటికి వైభవం కోసం ఈ 34 నెలల్లో ఎంతో కష్టపడ్డాం.
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం:
చంద్రబాబు ప్రభుత్వం నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం పని చేస్తే, గవర్నమెంట్ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకుపోవడంలో మనం పని చేస్తున్నాం. గవర్నమెంటు బడులలో పిల్లలు తెలుగు మీడియంలో మాత్రమే చదవాలి. తమ పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకోవడం వారి విధానం మంచిదా? లేక నిరుపేదలు ఇంగ్లిష్ మీడియంలో చదవాలన్న మా విధానం మంచిదా? అని అడుగుతున్నాను.
ఈ తరం పిల్లలు కూడా వారి పొలాల్లో కూలీలుగానూ, వారి వ్యాపారం, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేయాలన్న చంద్రబాబు అన్యాయమైన ఆలోచన మంచిదా? లేక ఈ తరం పిల్లలు రాబోయే ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, ఎదిగేందుకు అవకాశం ఉన్న చదువులు చదివించాలన్న మా విధానం సరైందా? ఒక్కసారి ఆలోచించండి. అమ్మ ఒడి అనే పథకాన్ని చంద్రబాబు ఏనాడైనా కలలో అయినా ఊహించారా? పేదింటి పిల్లలు మధ్యలో చదువులు ఎందుకు మానేస్తున్నారో చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?
ఆయనది ఆ ఒక్క పథకం:
మాట్లాడితే 40 ఏళ్ల రాజకీయ జీవితం అంటారు. కానీ ఎందుకు? ఆయన పేరు చెప్పగానే కనీసం ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? ఒక్క వెన్నుపోటు అన్న పథకం తప్ప. ఎన్టీ రామారావు మొదలు, ప్రధాని మోదీ వరకు ఆయన ఎవరినీ వదల్లేదు.
అదే ఇవాళ ఏమేం జరుగుతున్నాయి:
కోవిడ్ సమయంలో కూడా గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలు పెరిగారు. చంద్రబాబు హయాంలో స్కూళ్లు శిథిలాలుగా మారే పరిస్థితి ఉంటే ఇవాళ నాడు-నేడుతో స్కూళ్లు పూర్తిగా మారుతున్నాయి. కొత్తగా స్కూల్ టీచర్లే కాకుండా సబ్జెక్ట్ టీచర్లు కూడా రాబోతున్నారు. బైలింగ్వువల్ టెక్స్ట్ బుక్స్. 10 హంగులతో రూపం మారిన, మారుతున్న స్కూళ్లు. వాటిని తెరిచే సమయానికి సకాలంలో యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్తో పాటు, మంచి ఆహారం గోరుముద్దలో ఇస్తున్నాం.
బడి పిల్లలు పెరుగుతున్నారు:
ఇవన్నీ చేస్తున్నాం కాబట్టే ఒకటి నుంచి 10వ తరగతి వరకు చూస్తే, పిల్లల సంఖ్య 2018–19లో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో కలిపి 70.43 లక్షలు ఉంటే, ఇవాళ అది 73.05 లక్షలకు పెరిగింది. అదే గవర్నమెంటు స్కూళ్లలో చూస్తే 2018-19లో పిల్లల సంఖ్య 37.20 లక్షలు ఉంటే ఇవాళ 43.43 లక్షలు. అంటే ఆరున్నర లక్షల పిల్లలు ప్రైవేటు స్కూళ్ల నుంచి మారుతున్నారు. వాటిలో చదవాలంటే ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు చేయించాల్సి వస్తోంది. ఆ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లు మారుతున్నాయి.
బాబు హయాంలో జరిగి ఉంటే?:
ఇదే చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల సంఖ్య ఒక్క లక్ష పెరిగినా చాలు.. ప్రపంచ విద్యా రంగానికే చంద్రబాబు చుక్కాని అని, చుక్కా రామయ్య కంటే చంద్రబాబు గొప్ప విద్యావేత్త అని, 100 శాతం అక్షరాస్యత ఉన్న దేశాల అధ్యక్షులు, ఐక్యారాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం కరకట్ట మీద పడిగాపులు కాస్తున్నారని ఎల్లో మీడియాలో నెలల తరబడి కథనాలు చూసే వాళ్లం. చంద్రబాబు పాలనలో అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినా బ్రహ్మాండంగా ఉందని, రెండేళ్లు బకాయి పెట్టినా చాలా బాగుందని ఎల్లో మీడియా ప్రచారం చేసింది.
దుష్ప్రచారమే వారి ఎజెండా:
దాదాపు రూ.1800 కోట్లు ఎగ్గొట్టి పోయినా, బాబు పాలన బాగుందని.. అదే జగన్ వాటిని చెల్లించి, టైమ్ టు టైమ్ పూర్తి ఫీజు ఇస్తున్నా కూడా ఒకేరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రెండు స్టోరీలు. ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడుకు అనిపిస్తుంది. కానీ పిల్లలు, తల్లిదండ్రులకు కాదు. మధ్యాహ్న భోజన పథకంలో 8 నెలలు బకాయి పెట్టి పోయారు. అప్పుడు నీళ్లచారు ఇస్తే, ఇవాళ రోజుకొక మెనూతో పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నాం. కానీ కాకి పిల్లకు కాకి ముద్దు అన్నట్లుగా ఎల్లో మీడియాకు చంద్రబాబు ముద్దు.
ఏ పాలన బాగుందో చెప్పండి:
ఇక అక్కచెల్లెమ్మల విషయానికి వస్తే, 2014 ఎన్నికల సమయానికి డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, ఆ పని చేయకపోగా, వారికి సున్నా వడ్డీ పథకం కూడా అమలు చేయలేదు. అంతే కాకుండా చాలా సంఘాలను ఎన్పీఏలుగా మార్చాడు. మరి బాబు పాలన బాగుందా? డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి, వారి రూ.25 వేల కోట్లకు పైగా రుణాలను నాలుగు వాయిదాల్లో వారి చేతుల్లో పెడతామని చెప్పి ఇప్పటికే అందులో సగం రూ.12,758 కోట్లు, దాదాపు 80 లక్షల అక్కచెల్లెమ్మలకు నేరుగా అందించి, మిగతా మొత్తం కూడా అన్న మాట ప్రకారం ఇస్తున్న వైఎస్సార్ ఆసరా బాగుందా? అని అడుగుతున్నాను.
సున్నా వడ్డీ పథకం ఎగ్గొట్టిన చంద్రబాబు పాలన బాగుందా? లేక సున్నా వడ్డీ పథకానికే రూ.2,354 కోట్లు మనమే చెల్లించి ఇస్తున్న వైయస్సార్ సున్నా వడ్డీ బాగుందా? అని అడుగుతున్నాను. ఇసుకలూటీని ఆపిన ఎమ్మార్వో వనజాక్షిని ఒక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పడ్చుకుని ఈడ్చాడు. అలాగే ఆర్థికంగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డు మీదకు ఈడ్చిన చంద్రబాబుకు.. అక్కచెల్లెమ్మలు, మహిళలు అనే అర్హత కూడా లేదు. వారు ఆయనను అంతగా అసహ్యించుకుంటున్నారు.
ఏనాడైనా ఆలోచించారా?:
స్కూళ్లలో కనీస సదుపాయాలు లేకపోవడంతో ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారని చంద్రబాబుగారు ఏనాడైనా ఆలోచించారా? అలాగే ఆడపిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారని, వారి రక్షణ గురించి కానీ, 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఆలోచించారా?. బడులలో టాయిలెట్ల గురించి యోచించారా?
అయినా డాంభిక ప్రచారం:
ఇటువంటి ఈ పెద్దమనిషి సెల్ఫోన్ నేనే కనిపెట్టా, హైదరాబాద్ సిటీ నేనే కట్టా. అదిగో హైపర్ లూప్. ఇదిగో బులెట్ ట్రెయిన్. ఇక్కడే ఎయిర్ బస్. బిల్గేట్స్ నా కంప్యూటర్ నాలెడ్జ్ చూసి మూర్ఛబోయాడు. సత్యనాదెళ్లకు నేనే చదువులు చెప్పించాను. పీవీ సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించాను. అని బడాయిలు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే ఆయనకు.. దిశ చట్టం గురించి కానీ, దిశ యాప్ గురించి కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ, ప్రతి 2 వేల జనాభాకు సచివాలయంలో మహిళా పోలీస్ కానీ.. ఇలాంటి కాన్సెప్ట్స ఏనాడైనా ఆలోచించారా?
దిశ యాప్:
దిశ యాప్ డౌన్లోడ్ చేసిన ఫోన్ను 5సార్లు ఊపితే చాలు, 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. కోటి 13 లక్షల అక్కచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపు పోలీసులు వస్తున్నారు. ఆ సమయాన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటికే 900 మంది అక్కచెల్లెమ్మలు రక్షణ పొందారు. అయితే దీన్ని మేము ఏనాడూ మా ఘనతగా చెప్పుకోలేదు. ఒక బాధ్యతగా బుర్ర పెట్టి, మహిళల భద్రత కోసం ఆలోచిస్తున్నామని గర్వంగా చెబుతున్నాం.
బాబు బుర్ర తక్కువ పాలన:
అయినా కూడా బాబుగారి బుర్ర తక్కువ పాలన అద్భుతమని, అమోఘమని బుర్ర కథలు చెప్పడానికి ఒక ఈనాడు, ఒక రాధాకృష్ణ, ఒక టీవీ5 ఇలాంటి నలుగురు ప్రత్యేకమైన కళాకారులు, వారి కింద బృందాలను తయారు చేసుకున్నారు తప్ప, ప్రజలకు మంచి చేసి వారి మన్ననలు పొందాలన్న ఆలోచన చేయలేదు.
అక్కచెల్లెమ్మల కోసం:
45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండి కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లెమ్మల జీవితాల గురించి, వారికి ఆర్థికంగా అండగా నిలబడితే, ఆ కుటుంబాలకు మేలు జరుగుతుందన్న ఆలోచన చంద్రబాబు ఏనాడైనా చేశారా? 25 లక్షల పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో మనం ఇస్తున్న డబ్బు అక్షరాలా రూ.75 వేలు. ఏటా రూ.18,750 చొప్పున ఇస్తున్నాం. ఈ రెండేళ్లలో వైఎస్సార్ చేయూత కింద రూ.9 వేల కోట్లు వ్యయం చేశాం. ఇంకా రిలయెన్స్, పీ అండ్ జీ, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేలా చర్యలు తీసుకున్నాం.
కోవిడ్ కష్టకాలంలోనూ..:
కోవిడ్ కష్టకాలంలో కూడా జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, 31 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు, ఇళ్ల నిర్మాణం వంటివి చేస్తూనే చేయూత పథకం అమలు చేశాం. అదే స్ఫూర్తితో ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అమలు చేస్తున్నాం. పేదరికంలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన అక్కచెల్లెమ్మలను ఆదుకుంటున్నాం. కానీ చంద్రబాబు తన పాలనతో ఏనాడైనా ఆ ఆలోచన చేశారా? చేయలేదు అంటే ఆయనకు ఆ మనసు లేదు.
ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం. చంద్రబాబుగారి పార్టీ పుట్టి 40 ఏళ్లు అయింది. కానీ వారు ఏనాడైనా ఈ పని చేసిన చరిత్ర ఉందా? రెండు దశల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఇప్పటికే తొలి దశ ఇళ్లు దాదాపు పూర్తవుతున్నాయి. అవన్నీ పూరైయితే ప్రతి అక్క చెల్లెమ్మల చేతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి పెట్టినట్లు అవుతుంది. అదే ఉభయ గోదావరి జిల్లాలలో చూస్తే ఆ ఆస్తి విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుంది.
ఆ భయంతోనే విమర్శలు:
ఇవన్నీ పూరైయితే తమకు పూర్తిగా పుట్టగతులు ఉండవని, ఇప్పుడు వచ్చిన 23 సీట్లు కూడా రావని భావించి, భయంతో ప్రతి పనిని అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తున్నారు. ఆ ప్రయత్నాలు, విమర్శలు తప్ప, ఏనాడూ పేద ప్రజలకు గుండెలో పెట్టుకోలేదు. చంద్రబాబుగారి పార్టీ జెండా, గుర్తులోనే గుడిసె ఉంటుంది. పేదలు ఆ గుడిసెలోనే ఉండాలని కోరుకుంటారు. చివరకు కట్టీకట్టని టిడ్కో ఇళ్లు కూడా తామే కట్టామని డ్రామాలు. అసలు వారు మొదలు పెట్టినవి కేవలం 2.63 లక్షలు మాత్రమే. వాటిలో డ్రైనేజీ లేదు. రోడ్లు లేవు. కరెంటు లేదు. 80 వేల ఫ్లాట్లు ఒక స్టేజ్కు వచ్చాయ. మిగతావాటిలో అవీ లేవు. వాటిని పూర్తి చేస్తుంటే, దానిపైనా దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న తర్వాత కూడా ఇన్ని లక్షల మంది, 31 లక్షల మంది పక్కా ఇళ్లు లేకుండా ఎందుకు మిగిలిపోయారన్న దానికి చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా?
అన్నింటిలోనూ వారికి ప్రాధాన్యం:
నామినేటెడ్ పదవులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే పదవుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వడంతో పాటు, 50 శాతం మహిళలకు ఇస్తూ దేశంలోనే తొలిసారిగా ,చట్టం చేశాం. బీసీలకు చంద్రబాబు ఏం చేశారన్నది ప్రజలు ఆలోచించాలి. ఆయన ఏనాడైనా నేతన్న నేస్తం, చేదోడు, మత్స్యకార భరోసా, తోడు వంటి పథకాల గురించి ఆలోచించాడా? చంద్రబాబు పాలనలో అగ్రిగోల్డ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నా కూడా, వారిని పట్టించుకోలేదు. కానీ మన ప్రభుత్వం ఆ బాధితులకు రూ.905 కోట్లు చెల్లించింది. అదీ ఆయన పాలనకు, మన పాలనకు తేడా.
అందుకే చిచ్చు పెట్టే ప్రయత్నం:
ఇవన్నీ ఆయన చేయలేదు. మంచి కూడా చేయలేదు కాబట్టే, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, నిత్యం ఏదో ఒకటి తీసుకోవడం, దాంతో ప్రభుత్వానికి ఏ సంబంధం లేకపోయినా కూడా పొగ వేయాలని నానా తంటాలు పడుతున్నాడు. ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 డబ్బా వేయడం. చంద్రబాబును సీఎం చేయాలన్న తపన, తాపత్రయంతో స్థాయి మర్చి పని చేస్తున్నారు.
అధికారంలో ఉండి పట్టపగలు గుడులు కూలగొట్టిన చరిత్ర వారిది. అధికారం పోయినప్పుడు రథాలు తగలబెట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం వంటి ఆలోచనలు రాకుండా ఉంటాయా? రథాలు తిరిగి తయారు చేయడం, విగ్రహాలు ప్రతిష్టించడం వంటివి చేస్తుంటే, తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి సంకుచిత భావాలున్న రాజకీయ నాయకులు, మీడియా ఉంది.
ఆయనకు నైతిక హక్కు లేదు:
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మనది. అది వారికి లేదు. ఆర్టీసిని ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర మనది. వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 30 వేల పోస్టులు భర్తీ చేస్తున్న చరిత్ర మనది అయితే, ఆ ఆస్పత్రుల్లో పిల్లలను ఎలుకలు కొరకడం చూశాం. ప్రభుత్వ సంస్థలను పప్పు బెల్లాలకు అమ్ముకున్న చరిత్ర వారిది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
ఎందరో ఉద్యోగులు-వారి శ్రేయస్సు:
2.70 లక్షల మంది వలంటీర్లు మన కళ్ల ముందే సేవలందిస్తున్నారు. లక్ష మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాం. మెరుగైన వేతనాలు సక్రమంగా వచ్చేలా చూస్తున్నాం. అలాగే 20 వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 34 నెలల్లోనే ఈ విధంగా 6.03 లక్షల మంది ఉద్యోగులు మన కళ్ల ముందే కనిపిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంచి వేతనాల కోసం టైమ్ స్కేల్ ఇచ్చాం. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక నెల ముందు మాత్రమే ఆ జీఓ ఇచ్చి, అది కూడా జూన్ నుంచి అమలు చేసేలా. అలాంటి వ్యక్తి ఇవాళ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాడు.
ఆయనకు తానా అంటే తందానా అంటున్నారు కమ్యూనిస్టు నాయకులు. కాబట్టి వారూ ఆలోచించాలి. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటరీ వర్కర్లు, హోంగార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, 108, 104 సర్వీసుల సిబ్బంది.. అలా చాలీచాలని వేతనంతో పని చేస్తున్న 3,07,727 మందికి మేలు చేసేలా గతంలో వారి జీతాలు రూ.1100 కోట్లు అయితే ఇవాళ రూ.3 వేల కోట్లు ఇస్తున్నాం.
ఆరోగ్య ప్రదాయిని–ఆరోగ్యశ్రీ:
అంతే కాకుండా భారమైన పీఆర్సీ. ఇబ్బందులు ఎన్నో ఉన్నా, ఉద్యోగుల సంతోషం కోసం వీలైనంత వరకు వారి వేతనాలు పెంచాం. ఆరోగ్యశ్రీ. వారు గతంలో దాన్ని సక్రమంగా అమలు చేయలేదు. మనందరి ప్రభుత్వంలో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి ఈ పథకం ఇస్తున్నందువల్ల దాదాపు 95 శాతం ప్రజలకు పథకం వర్తిస్తోంది. గతంలో ఈ పథకంలో కేవలం 1000 చికిత్సలు మాత్రమే ఉండగా, ఇవాళ 2600 ప్రొసీజర్లకు వర్తింపచేస్తున్నాం. ఆరోగ్య ఆసరా. చికిత్స తర్వాత వైద్యులు సూచించినంత కాలం నెలకు రూ.5 వేల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. దీని గురించి చంద్రబాబుగారు ఏనాడూ ఆలోచించలేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.680 కోట్లు బకాయి పెడితే, మన ప్రభుత్వం చెల్లించింది. ఇవాళ నెలలోపే బిల్లులు ఇస్తున్నాం.
బెస్ట్ మెడికల్ ఫెసిలిటీ:
దాదాపు 1100 అంబులెన్సులు (108, 104 సర్వీసులు) ఒకేసారి ప్రవేశపెట్టాం.గ్రామ గ్రామాన వైయస్సార్ హెల్త్ క్లినిక్లు. కోవిడ్ సమయంలో టెస్టులు, చికిత్సలో మన రాష్ట్రం టాప్. కోవిడ్ మరణాలు మన దగ్గర చాలా తక్కువ. మన వద్ద మంచి ఆస్పత్రులు లేకపోయినా, గ్రామ స్థాయిలో వలంటీర్లు, ఆశా వర్కర్లు బాగా పని చేశారు. దాదాపు 36 హౌజ్ టు హౌజ్ సర్వేలు చేశారు. దాని వల్ల అందరినీ కాపాడుకున్నాం.
మరణాలు తగ్గించాం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ 11 టీచింగ్ ఆస్పత్రులు ఉంటే, కొత్తగా 16 ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులు గతంలో శిధిలావస్తకు చేర్చగా, వాటిని పూర్తిగా మెరుగుపరుస్తున్నాం. ఆ తేడా గమనించాలి. నాడు–నేడులో దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నాం. చరిత్రలో లేని విధంగా 39 వేల మంది డాక్టర్లు, నర్సులను నియమిస్తున్నాం. కాబట్టి వైద్య రంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. రైతులను చంద్రబాబు మోసం చేస్తే, మేము వారిని ఆదుకుంటున్నాం.
రైతు రాజ్యం:
ప్రతి రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా, దాన్ని రూ.13,500కు పెంచి, 5 ఏళ్లు ఇస్తున్నాం. కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఇస్తున్నాం. దాదాపు అర కోటి రైతులకు ఈ పథకం అమలు చేస్తున్నాం. చంద్రబాబుగారు ఏనాడూ ఆ ఆలోచన చేయలేదు. ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదన్నాడు. విద్యుత్ బకాయిల కోసం రైతులను పీడించాడు. ఇవాళ పాడి రైతులకు మేలు చేయడం కోసం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంటే దాన్ని విమర్శిస్తున్నాడు. రైతు భరోసా సహాయం అందిందని రైతులు చెబితే దాన్నీ జీర్ణించుకోలేకపోతున్నాడు.
చంద్రబాబు వేషాలు-చర్యలు:
ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తనాల బకాయిలు రూ.380 కోట్లు, ఇంకా రూ.9 వేల కోట్లు కరెంటు బకాయిలు పెట్టి పోయాడు. అయినా చిరునవ్వుతో చెల్లించాం. ఎన్నికల సమయంలో రైతు మాదిరిగా వేషం కడతాడు. తలపాగా చుడతాడు. ఫోటోలు ఇస్తాడు. హామీలు ఇచ్చి, ఎన్నికలు అయిపోగానే మోసం చేస్తాడు. అలాంటి వ్యక్తి మన వ్యవసాయ విధానాన్ని విమర్శించడం సిగ్గుచేటు.
రైతులను మోసం చేసి, వారి బంగారాన్ని వేలం వేసే పరిస్థితి తీసుకువచ్చిన చంద్రబాబుకు... ఉచిత పంటల బీమా, ప్రభుత్వమే ప్రీమియమ్ చెల్లింపు. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు. వేగంగా బీమా పరిహారం చెల్లింపు ఎక్కడా ఆలస్యం లేకుండా జరుగుతున్నా ఏవీ కనిపించడం లేదు. రైతులకు విత్తనం మొదలు పంటలు అమ్ముకునే వరకు ఈక్రాప్ ద్వారా అడుగడుగునా అండ. ఇది విప్లవాత్మక మార్పు. రైతులను అన్ని రకాలుగా మోసం చేసింది చంద్రబాబు అయితే, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది మా ప్రభుత్వం. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి
అప్పులపై దుష్ప్రచారం:
ఇక రాష్ట్రం అప్పులలో కూరుకుపోయిందని ప్రచారం చేస్తున్నారు. 2014 నాటికి రాష్ట్రానికి రూ.1,20,556 కోట్ల అప్పులు ఉంటే, 5 ఏళ్లలో అవి రూ.2,68,225 కోట్లకు చేరుకున్నాయి. అవే కాకుండా ఆయన చెల్లించకుండా దాదాపు రూ.39 వేల కోట్లు వదిలేశాడు. అవే కాకుండా ప్రభుత్వ గ్యారెంటీ మీద 2014 నాటికి చేసిన అప్పులు రూ.14,028 కోట్లు అయితే, చంద్రబాబు హయాంలో 2019 నాటికి మరో రూ.58 వేల కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల పంపిణీకి సంబంధించిన బకాయిలు 2014 నాటికి రూ.2893 కోట్లు ఉంటే, అవి 2019 నాటికి రూ.21,540 కోట్లకు పెరిగాయి. అంటే విద్యుత్ కొనుగోలు చేసి వారికీ ఎగ్గొట్టాడు. ఇంకా వివిధ రాష్ట్ర సంస్థలకు సంబంధించి 2014 నాటికి రూ.20,703 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.68596 కోట్లకు పెరిగాయి. దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారా? లేక ఆర్థిక అరాచకం అంటారా? ఈనాడు, ఆంధ్రజ్యోతికి తెలియాలి.
ఆ పాపాలు వెంటాడుతున్నాయి:
రాష్ట్రం మీద ఇంత భారం మోపి ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. అంతా అవినీతికి పోయింది. అదే మనం చేసిన అప్పు ప్రజల జేబుల్లోకి పోయింది. టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎంకు లోబడి, జీఎస్డీపీ పరిమితి 3 శాతానికి మించి ఏటా అప్పులు చేశారు. ఆ మేరకు 2014–15లో 3.5 శాతం, 2015–16లో 3.65 శాతం, 2016–17లో 4.52 శాతం, 2017–18లో 4.12 శాతం, 2018–19లో 4.07 శాతం అప్పులు ఎక్కువగా చేశారు. ఇలా ఎక్కువ అప్పులు చేయడం వల్ల ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులో రూ.16,419 కోట్ల కోత పెట్టారు. దానిపై కేంద్రంతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆ విధంగా చంద్రబాబు చేసిన పాపాలు మనల్ని వెంటాడుతున్నాయి.
అయినా వాటికి కనిపించవు:
ఇదీ బాబు హయాంలో ప్రతి ఏటా అప్పులు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 17.33 శాతం చొప్పున పెరిగినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు కనిపించదు. మనం ఆ అప్పు కడుతున్నాం. మన హయాంలో పెరిగిన అప్పు 14.88 శాతం మాత్రమే. పాపాలు చంద్రబాబువి. ప్రాయశ్చితం మనది. అయినా ఈ నిజాన్ని దాచి, మన ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న వారిది జర్నలిజం అంటారా. మరోవైపు చేతకాని వాడికి కోపం ఎక్కువ అన్నట్లు రోజుకు జూమ్ మీటింగ్. నాలుగు ప్రెస్మీట్లు. తిట్టించడం. ఎల్లో మీడియాలో జోరుగా ప్రచారం. చంద్రబాబు, ఆయన పార్టీ ప్రజలకు చేసిన మేలు ఏమిటి? దీన్ని అందరూ ఆలోచించాలి.
చివరగా..
తమకు అధికారం పోయి 1000 రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబునాయుడు పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియా వారికి, వేర్వేరు సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారికి, వీళ్లందరికి కూడా ట్యామ్ ఫార్టీ ట్యాబ్లెట్లు, జెలుసిల్ సిరప్, ఈనో ప్యాకెట్లు విరివిగా లభించాలని కోరుకుంటూ.. ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.. అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.