కౌశల్ రాష్ట్రస్థాయి పోటీలకు 12 మంది ఎంపిక
అనకాపల్లి టౌన్: కౌశల్ సైన్స్ రాష్ట్ర స్థాయి పోటీ లకు 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక జీవీఎంసీ టౌన్ గర్ల్స్ హైస్కూల్లో జిల్లా స్థాయి కౌశల్–2025 పోటీలు శనివారం జరిగాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని గునిపూడి హైస్కూల్(నాతవరం మండలం), ద్వితీయ బహుమతిని రేవు పోలవరం ఉన్నత పాఠశాల (ఎస్.రాయవరం మండలం), తృతీయ బహుమతిని ఏపీ మోడల్ స్కూల్ (మునగపాక మండలం) విద్యార్థులు గెలుచుకున్నారు.జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన ఈ పాఠశాలలకు చెందిన మొత్తం 12 మంది (8, 9, 10 తరగతుల) విద్యార్థులు ఈ నెల 27న తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి కౌశల్ పోటీల్లో పాల్గొంటారని కౌశల్ పోటీల జిల్లా కోఆర్డినేటర్ పి.మహేశ్వరరావు తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ, శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు విద్యార్థులకు బహుమతులు, ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ అధి కారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


