
అదనపు సిబ్బంది కోసం ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
ఆర్టీసీ డిపో వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు
అనకాపల్లి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలంటే తక్షణం సుమారు 1000 మంది సిబ్బందిని కొత్తగా నియమించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డిపో గేటు వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని, పదోన్నతిలో జరుగుతున్న జాప్యంపై, 1/2019 సర్కులర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కొత్తగా 2500 బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. సీసీఎస్ ఆఫీసు తరలింపు ఆపాలన్నారు. పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలను అరియర్స్తో కలిసి చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి వై.వి.ఎస్.కుమార్, జిల్లా ఏపీ ఎన్జీవో అమరావతి మహిళా కార్యదర్శి కె.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.