తనువంతా కనులై..

 సుందరసీతారామచంద్ర స్వామివారి ఆలయ మార్గం, (ఇన్‌సెట్‌) సీతారాముల విగ్రహాలు - Sakshi

చలువ పందిళ్లు...మామిడాకుల తోరణాలు.. విద్యుత్‌ దీపాలంకరణతో ముస్తాబైన ఏజెన్సీ భద్రాద్రి శ్రీరామగిరి కల్యాణశోభతో కాంతులీనుతోంది. రాములోరి కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు కనులారా సీతారాముల కల్యాణం వీక్షించేందుకు భక్తులు తనువంతా కనులై.. ఎదురుచూస్తున్నారు.

వీఆర్‌పురం: సీతారాముల కల్యాణానికి శ్రీరామగిరిలోని కొండమీద శ్రీ సుందర సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబయింది. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం కల్యాణోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఏలూరు, అల్లూరి జిల్లాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ భద్రాద్రిగా ఈ ఆలయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయానికి సమీపంలోని గ్రామాలన్నీ రామాయణ ఘట్టాలతో ముడిపడి ఉన్నాయనడానికి ఆధారాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. రామయ్య కల్యాణాన్ని వైభవంగా జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయానికి రంగులు వేసి అందంగా తీర్చి దిద్దడంతో పాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. హోమగుండం,కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలోనే దక్షిణాపథ ముఖం కలిగిన దివ్య పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల్లో కూడా రామాయణ కాలం నాటి ఆనవాళ్లు ఎన్నో దర్శనమిస్తాయి. ఇక్కడ తలంబ్రాల కార్యక్రమం ముగిసిన పిదపనే భద్రాచలంలోని భద్రగిరి రామునికి తలంబ్రాలు పోశేవారని, క్రమేపి ఆ విధానంలో మార్పు చోటు చేసుకుందని ఆలయ ప్రధాన అర్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యులు,చైర్మన్‌ రేవు బాలరాజు తెలిపారు.

ఆలయ విశిష్టత

సుమారు 500 ఏళ్ల క్రితం మాతంగి మహర్షి ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. దండకారణ్యంలో సీతాదేవి అపహరణకు గురికాగా ఆమె జాడ కోసం వెదుకుతూ వచ్చిన శ్రీరాముడు ఈ కొండపై దక్షిణ దిక్కుగా కూర్చుని తపస్సు చేశారని, అందువల్లే ఆలయ ముఖద్వారం దక్షిణ దిక్కుగా ఉంటుందని అర్చకులు తెలిపారు. శ్రీరామగిరికి సమీపంలో వాలిసుగ్రీవుల గుట్టలు ఉన్నాయి.అంతేకాక మాయ లేడిగా మారిన మారీచుని కొట్టిన ప్రదేశం ప్రస్తుతం చొక్కనపల్లి గ్రామమని, అందుకు ఆధారం గోదావరి నదిలో బండపై లేడి ఆకారం,రాముని పాదాలు స్పష్టంగా దర్శనమివ్వడమేనని ఇక్కడి వారు చెబుతున్నారు. వృద్ధ జటాయువు రావణాసురుడిని ఎదిరించి పోరాడే క్రమంలో రెక్క తెగిపడిన ప్రాంతాన్ని రెక్కపల్లిగా ఈ ప్రాంతవాసులు విశ్వసిస్తారు. నాటి రెక్కపల్లి నేడు రేఖపల్లిగా పిలువబడుతోంది.

జటాయువు మండపం సిద్ధం

ఉష్ణగుండాలలో వేడినీళ్ల బావి రడీ

ఎటపాక: భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తుల సందర్శనార్థం తెలంగాణ సరిహద్దున ఉన్న అల్లూరి జిల్లా ఎటపాక మండలంలోని జటాయువు మండపం, గుండాల గ్రామంలోని ఉష్ణగుండాల గోదావరి నదిలో వేడినీళ్ల బావిని సిద్ధం చేశారు. ఏటా భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం,ముక్కోటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు జఠాయువు మండపం,ఉష్ణగుండాలను దర్శించుకుంటారు.

రాములోరి పెళ్లిని తిలకించేందుకు భక్తుల ఎదురుచూపు

నేడు ఏజెన్సీ భద్రాద్రి శ్రీరామగిరిలోకళ్యాణోత్సవం

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు




 

Read also in:
Back to Top