ఘనంగా ప్రపంచ చిరుధాన్యాల మహోత్సవం
సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏ కాఫీ అతిథి గృహంలో శుక్రవారం ప్రపంచ చిరుధాన్యాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెలుగు ఆధ్వర్యంలో పలు డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తయారుచేసి ఇక్కడ ప్రదర్శించిన చిరుధాన్యాల వంటకాలను జాయింట్ కలెక్టర్ శివశ్రీనివాస్, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, సబ్కలెక్టర్ అభిషేక్ రుచి చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగం అధికమైందన్నారు. గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న చిరుధాన్యాలను గిరిజన మహిళలు ఆహారంగా తీసుకుని రక్తహీనత సమస్య నుంచి విముక్తి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మురళీ, వ్యవసాయాధికారి నందు, ఎల్డీఎం రవితేజ తదితరులు పాల్గొన్నారు.