వలసల నివారణే లక్ష్యంగా ఉపాధి పనులు
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర
ముంచంగిపుట్టు: గిరిజన ప్రాంతంలో వలసలు నివారణే లక్ష్యంగా ఉపాధి కల్పన జరుగుతుందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలో గల మాకవరం పంచాయతీ సేబుగుడ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఉపాధి పనుల్లో ఎదురవుతున్న సమస్యలపై ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్నారు. చేస్తున్న పనులకు అందుతున్న పేమెంట్ల పరిస్థితిపై ఆరా తీశారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కూలీలకు సూచించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ వలసలు నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటీవల పెదబయలు మండలంలో కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా బాధించిదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీ భాగ్యవతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్న్ననారు.