త్వరితగతిన వంతెన నిర్మాణం
వై రామవరం/మారేడేమిల్లి: ఏజెన్సీలోని కాలువలపై కొత్తగా మంజూరైన వంతెనల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ఆదేశించారు. వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలోని బంగారు బందలు కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు బందలు కాలువపై వంతెన పూర్తయితే వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అనంతరం చింతలపూడి గ్రామసచివాలయాన్ని ఆయన పరిశీలించారు. గ్రామసచివాలయం ద్వారా అందిస్తున్న సేవలను ఆయన తెలుసుకున్నారు. మారేడుమిల్లి మండలం పందిరిమావిడి కోటలో ఉగాది పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మారేడుమిల్లి మండలంలో మారుమూల గ్రామమైన బంద ఆశ్రమ పాఠశాలను పీవో పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందించాలని సూచించారు.
సకాలంలో సిలబస్ పూర్తిచేసి పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. చింతలపూడి సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ, ఎంపీటీసీ ముల్ల జోగిరెడ్డి, వైస్ సర్పంచ్ పల్లాల లచ్చిరెడ్డి, ఈవోపీఆర్డీ మూర్తి పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే