ఇంటర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థుల డిబార్
విశాఖ విద్య: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. శుక్రవారం విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిధిలో 128 కేంద్రాల ద్వారా జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 49,373 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 48,346 మంది హాజరయ్యారు. దీంతో 97.92 శాతం హాజరు నమోదైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి. ఉమారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోని ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడ్టారు. తనిఖీ నిమిత్తం వెళ్లిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం మాల్ ప్రాక్టీస్ను గుర్తించి, ఆ ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు ఆర్ఐవో ఉమారాణి వెల్లడించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.