చిరుధాన్యాలతో ఆరోగ్యం
అనకాపల్లిటౌన్ : చిరుధాన్యాలతో మంచి ఆరోగ్యం లభిస్తుందని, వీటి వినియోగం ఇప్పుడు బాగా పెరిగిందని సీ్త్ర శిశు సంక్షేమశాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.ఉషారాణి తెలిపారు. చిరుధాన్యాల పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా స్థానిక చిన్నవీధి జార్జిస్కూల్ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చేనెల 3వ తేదీ వరకూ పోషణ పక్వాడ కార్యక్రమాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు, అరికెలతో తయారు చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ఆమె రుచిచూశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి సీడీపీవో పి.ప్రభావతి, సూపర్ వైజర్ నిర్మల పాల్గొన్నారు.