డీఎంఈ పరిధిలోకి ‘వెల్‌నెస్‌’ | - | Sakshi
Sakshi News home page

డీఎంఈ పరిధిలోకి ‘వెల్‌నెస్‌’

Dec 8 2025 8:00 AM | Updated on Dec 8 2025 8:00 AM

డీఎంఈ పరిధిలోకి ‘వెల్‌నెస్‌’

డీఎంఈ పరిధిలోకి ‘వెల్‌నెస్‌’

ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు మెరుగుకానున్న వైద్య సేవలు రిమ్స్‌ పరిధిలోనే స్పెషలిస్ట్‌ వైద్యుల ఏర్పాటుకు చర్యలు తీరనున్న ఇబ్బందులు

ఆదిలాబాద్‌టౌన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌, జర్నలిస్టులకు నగదురహిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2019లో వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వైద్యులు, మందుల కొ రతతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకనుంచి ఆ స మస్యలకు చెక్‌ పడనుంది. ఇది వరకు వెల్‌నెస్‌ సెంటర్లు ఆరోగ్యశ్రీ సీఈవో పరిధిలో కొనసాగేది. ఇక నుంచి డైరెక్టర్‌ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ (డీఎంఈ) పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో రిమ్స్‌ నుంచి వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అందిన ఉత్తర్వులు..

ఈ మేరకు డీఎంఈ నుంచి రిమ్స్‌ డైరెక్టర్‌కు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి వెల్‌నెస్‌ సెంటర్‌ను తమ పరిధిలోకి తీసుకొని సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పెన్షనర్లు, ఉద్యోగులు, జర్నలిస్టులు కలిపి దాదాపు 6వేల మంది వరకు ఉంటారు. వెల్‌నెస్‌ సెంటర్‌కు వెళ్లినా వైద్యసేవలు అందక తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం. పెన్షనర్లకు బీపీ, షుగర్‌ తదితర మందులు లేక ఇబ్బందులు పడ్డారు. ఇకనుంచి ఆ అవస్థలు తీరనున్నట్లు తెలుస్తోంది.

ఇక ‘స్పెషల్‌’ సేవలు..

వెల్‌నెస్‌ సెంటర్‌లో ప్రస్తుతం ముగ్గురు ఎంబీబీఎస్‌ వైద్యులకు గాను ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. ఇద్దరు డెంటిస్టులకు గాను ఒకరు సెలవులో ఉండగా, ఒకరు పనిచేస్తున్నారు. ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక నుంచి ఈ సెంటర్‌లో ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, డెంటల్‌, గైనిక్‌, చిల్డ్రన్‌ స్పెషలిస్టులు, ఇతర వైద్యుల ద్వారా సేవలు అందించనున్నారు. దీంతోపాటు రోగనిర్ధారణ పరీక్షలు సైతం చేపట్టనున్నారు. ప్రతిరోజు వెల్‌నెస్‌ సెంటర్‌కు 100 నుంచి 200 మంది వస్తున్నారు. స్పెషలిస్ట్‌ వైద్యులు లేకపోవడంతో చాలా మంది ఇక్కడ వైద్యసేవలు పొందలేక పోతున్నారు. ఈ సేవలు ప్రారంభిస్తే వెల్‌నెస్‌ సెంటర్‌ కిటకిటలాడనుంది.

మెరుగైన వైద్యసేవలు అందిస్తాం..

ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లకు వెల్‌నెస్‌ సెంటర్‌లో వైద్యసేవలు అందించడం జరుగుతుంది. ఇదివరకు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండగా, వారం క్రితం డీఎంఈ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. రిమ్స్‌ ద్వారా వెల్‌నెస్‌ సెంటర్‌లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. స్పెషలిస్ట్‌ వైద్యులను నియమిస్తాం. మందుల కొరత, ఇతర ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement