బస్చార్జీ లేని పేద గుండెకు 7 లక్షల వైద్యం
హైదరాబాద్ వెళ్లేందుకు బస్చార్జీ కూడా లేని ఓ పేద గుండెకు ఆరోగ్యశ్రీ కింద రూ.7 లక్షల విలువైన మూడు ఆపరేషన్లు ఉచితంగా జరిగాయి. ఆరోగ్యశ్రీతోనే తనకు పునర్జన్మ లభించిందని, ఇప్పుడు మనుమలు, మనుమరాళ్లతో ఉన్నానంటే అది వైఎస్సార్ చలవేనని చెబుతున్నాడు సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ వాసి గుడెల నర్సయ్య(70). ‘‘మూడేళ్ల కింద ఛాతినొప్పి వస్తుందని మనూరులోని ఆరోగ్యశ్రీ క్యాంపునకు పోయిన. అక్కడ డాక్టర్ చూసి హైద్రాబాద్కు రమ్మని చిట్టి రాసిచ్చిండు.
ఓ పెద్దాయన బస్చార్జీకి పైసలిస్తే పోయినా. గుండె ఆపరేషన్ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ.2 లక్షల విలువైన చికిత్స చేశామని డాక్టర్లు చెప్పారు. వైఎస్ ఎంతమంచి పథకం తెచ్చాడో అప్పుడు అర్థమైంది. మళ్లీ మధ్యలో రెండుసార్లు పోతే రెండుసార్లు స్టంట్ వేశారు. నాకు దాదాపు రూ.7 లక్షల వైద్యం ఉచితంగా అందిందని డాక్టర్ చెప్పారు’’ అని నర్సయ్య గుర్తుచేసుకున్నారు.