ప్రాణం తీసిన ఈత
కొత్తూరు ఊరకుంటలో పడి బాలుడు మృతి
రాయపర్తి : ఈత సరదా కోసం వెళ్లి గ్రామంలోని ఊరకుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తూరు శివారు గుంటూరుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నలజాల రమాదేవి, రమేష్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓకుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నలజాల రాధాకృష్ణ(14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నేహితులతో ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు.
సాయంత్రం ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గ్రామంతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. గ్రామంల వెతుకుతుండా స్థానిక ఊరకుంట వద్ద రాధాకృష్ణకు చెందిన దుస్తులు కన్పించాయి. దీంతో కుంటలో వెతికినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం కుంటలో రాధాకృష్ణ మృతదేహం బయటకు తేలింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.