'అత్యాచారాలకు మహిళల వస్త్రధారణ కారణం'
ముంబయి : అత్యాచారాలకు మహిళల వస్త్రధారణ, ప్రవర్తనే కారణమంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఆశా మిర్జే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు జనసంచారం లేని ప్రాంతాలకు వెళ్లి అనవసరంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారని ఆమె అన్నారు. ఇందుకు మహిళలుతమని తామే నిందించుకోవాలన్నారు.
బయటకు వెళ్లేటప్పుడు ఎవరితో వెళ్తున్నాం..... ఎందుకు వెళ్తున్నామనేది క్రాస్ చెక్ చేసుకోవాలంటూ ఆశా మిర్జే సలహాలు ఇచ్చారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్లో మరణించిన నిర్భయ....తన స్నేహితుడితో కలిసి రాత్రిపూట 11 గంటలకు సినిమాకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ముంబై శక్తి మిల్స్ రేప్ ఘటనలో కూడా బాధితురాలి తప్పు కొంత వరకు ఉందన్నారు. జనసంచారం లేని శక్తిమిల్స్కు చీకటి పడే సమయంలో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఎన్సీబీ సభ్యురాలైన ఆశా మీర్జే..... పార్టీ మహిళా విభాగం సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మాటలు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. ఆశా ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఎన్సీపీ అధినేత శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా వేదికపై ఉన్నారు. ఆశా మీర్జేను వారించే ప్రయత్నం సుప్రియా చేయలేదంటూ కొంత మంది సుప్రియను కూడా తప్పుపడుతున్నారు.