ట్రైనింగ్లో పాము రక్తం తాగించారట..?
బ్యాంకాక్ :
అడవిలో నివసించాల్సి వచ్చినప్పుడు ఆహారం లభించని సమయంలో, అందుబాటులో ఉన్న వనరులతో ఎలా బతకాలో థాయ్లాండ్ బోధనాసిబ్బంది యూఎస్ మెరైన్లకు శిక్షణ ఇచ్చింది. 'జంగిల్ సర్వైవల్' పేరుతో 10 రోజుల పాటూ జరుగుతున్న క్రాష్ కోర్సులో యూఎస్ మెరైన్లు కొత్త టెక్నిక్లను అభ్యసిస్తున్నారు. వీరు జాయింట్ మిలిటరీ ట్రైనింగ్లో భాగంగా థాయిలాండ్లో శిక్షణ పొందుతున్నారు. ఏ పాము విషపూరితమైంది, ఏ పాము విషపూరితం కాదు అనే విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకున్నారు.
దాదాపు 100 యూఎస్ దళాలు ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల అభయారణ్యాలలో జీవించాల్సిన పరిస్థతి వచ్చినప్పుడు ఎలా బతకాలో వారు నేర్చుకున్నారు. మూడు నిమిషాల్లోనే విషంతో మృత్యువు ఒడిలోకి పంపే నల్లత్రాచు పాముతో ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలిలాంటి అంశాలను నేర్చుకున్నారు. క్యాంపుకు వచ్చిన సభ్యులకు కఠోరమైన సాధనలో భాగంగా పాము రక్తం రుచిని కూడా చూపించారు. నీరు లభ్యం కాని ప్రాంతాల్లో దప్పికను అదుపు చేయడానికి పాము రక్తం ఉపయోగపడుతోందని థాయ్ ఆర్మీ సభ్యులు తెలిపారు. యూఎస్ మెరైన్లకు థాయ్ బోధనాసిబ్బంది 2009 నుంచి శిక్షణ ఇస్తున్నారు.
యూఎస్ మెరైన్లే కాకుండా, వివిధ దేశాలకు చెందిన 29మంది మిలిటరీ అధికారులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్లో మిలిటరీ బంధాలు బలపడడానికి ఈ ట్రైనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నారు.