రెండేళ్ల తర్వాత.. కాంగ్రెస్‌ ఎంపీలకు సర్‌ప్రైజ్






న్యూఢిల్లీ:
సార్వత్రిక ఎన్నికలు మొదలు.. మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలదాకా (పంజాబ్ మినహా) కాంగ్రెస్‌ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. అయితే, ప్రపంచంలోని అతిపెద్ద, పాత పార్టీల్లో ఒకటిగా ఇలాంటి ఎత్తుపల్లాలెన్నో చూశామని, 2019లో సత్తా చూపుతామని చెబుతారు కాంగ్రెస్‌ నాయకులు. వారి గట్టినమ్మకాన్ని మరింత బలపరుస్తూ అధినేత్రి సోనియా గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, కీలక నేతలకు విందు ఇచ్చారు. రాజకీయాల్లో విందులు సర్వసాధారణమే అయినప్పటికీ కాంగ్రెస్‌కు సంబంధించి ఇది మాత్రం ప్రత్యేక విందే! ఎందుకంటే ఇలాంటి విందొకటి జరిగి రెండు సంవత్సరాలైందిమరి!



మంగళవారం రాత్రి పార్లమెంట్‌ హౌస్‌లో సోనియా ఇచ్చిన విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. గత ఏడాది ఎన్నికల ర్యాలీలో అస్వస్థతకు గురైన తర్వాత పెద్ద వేడుకలో సోనియా పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అనారోగ్యంతో బాధపడుతోన్న సోనియా ఇటీవలే విదేశాల్లో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నారని విందులో పాల్గొన్న ఎంపీ ఒకరు మీడియాకు చెప్పారు.







Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top