టాయిలెట్లో బంధించిన సీనియర్లు.. చిన్నారి మృతి
కొంతమంది సీనియర్లు టాయిలెట్లో బంధించడంతో ఆయిండ్రిల్లా దాస్ అనే 11 ఏళ్ల చిన్నారి మరణించింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో తీవ్ర సంచలనానికి దారితీసింది. కోల్కతాలోని క్రైస్ట్ చర్చి గరల్స్ హైస్కూల్లో ఈ సంఘటన జరగడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. డమ్డమ్ ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రాంగణంలోకి బంధువులు గురువారం ఉదయమే ప్రవేశించి, అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఐదో తరగతి చదువుతున్న ఆ పాప మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ను తమకు అప్పగించాలని కూడా వారు డిమాండ్ చేశారు.
సీనియర్ పోలీసు అధికారులు పాఠశాలకు వెళ్లి, ఆగ్రహంతో ఉన్న బంధువులతో మాట్లాడారు. డబ్బులు డిమాండ్ చేసిన సీనియర్లు.. ఆ చిన్నారిని పాఠశాలలోని టాయిలెట్లో బంధించారు. ఆమె భయంతో అరవగా, ఓ స్వీపర్ బయటకు తీసుకొచ్చి.. ఇంట్లో అప్పగించింది. కొద్దిసేపటికే ఆమె షాక్కు గురైంది. ఆస్పత్రిలో చేర్చగా, బుధవారం మరణించింది. అయితే, ఈ సంఘటన గురించి తనకేమీ తెలియదంటూ పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు.ఈ సంఘటనపై విచారణకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ఆదేశించారు.