భారత్‌లోకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

భారత్‌లోకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6


న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. యాపిల్ ఐ ఫోన్ 6కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ ఈ ఫోన్‌లను మార్కెట్‌లోకి తెస్తోంది. అంతర్జాతీయంగా విడుదల చేసిన 3 వారాల తర్వాత వీటిని భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ (మొబైల్ అండ్ ఐటీ) అశిమ్ వార్సి చెప్పారు. సోమవారం నుంచే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించామని, వచ్చే నెల 10 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ ఫోన్‌లను ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ ఆవిష్కరించింది.

 

ప్రత్యేకతలు: కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ రెండు ఫోన్‌లలో 5.1 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, (ఎస్6 ఎడ్జ్‌లో డ్యూయల్ ఎడ్జ్ స్కీన్ ఉంటుంది), 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.  వెర్లైస్ చార్జింగ్ టెక్నాలజీ ఈ ఫోన్‌ల ప్రత్యేకత. 10 నిమిషాల చార్జింగ్‌తో 4 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్6లో 2,550 ఎంఏహెచ్ బ్యాటరీ, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌లో 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

 

భారత్‌లో తయారీ...

 ఈ ఫోన్‌ల రూపకల్పనలో భారత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ తగిన పాత్ర పోషించిందని, ఈ ఫోన్‌లను నోయిడా ప్లాంట్‌లో ఈ ఏడాదిలోనే తయారు చేయడం ప్రారంభిస్తామని ఆశిమ్ వార్సి పేర్కొన్నారు.

 

 ధరలు..

 మెమరీ        ఎస్6    ఎస్6 ఎడ్జ్

 32 జీబీ        49,000    58,900

 64 జీబీ        55,900    64,900

 128 జీబీ        61,900    70,900

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top