భారీ కుంభకోణంలో శాంసంగ్
సియోల్: న్యూ ఇయర్ 2017 ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు అనుకూలంగా ఉన్నట్టులేదు. కొత్త ఏడాదిలో కూడా కష్టాలు వీడడం లేదు. గత ఏడాదిలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ పేలుళ్ల కష్టాలనుంచి ఇంకా గట్టెక్కకముందే ఈ సంవత్సరం ఆరంభంలోనే రెండు కేసులు చుట్టుముట్టాయి. జస్ట్ నిన్న (మంగళవారం) అంతర్జాతీయ ట్రేడ్ నిబంధనలు ఉల్లఘించారంటూ అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ శాంసంగ్ పై మండిపడింది. వర్ల్ పూల్ దాఖలు చేసిన ఫిర్యాదులో శాంసంగ్, ఎల్జీ సంస్థలపై ఈ ఆరోపణలు చేసింది. తాజాగా సాక్షాత్తూ శాంసంగ్ అధిపతి జే ఎ లీ దక్షిణ కొరియా పార్క్ గెన్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. దక్షిణ కొరియాకు చెందిన విచారణ అధికారులు శాంసంగ్ బాస్ జే లీ పేరును కీలక నిందితుడుగా చేర్చారు. ప్రాసిక్యూటర్ కార్యాలయం లాంఛనప్రాయ నేరారోపణలను ఇంకా జారీ చేయనప్పటికీ అరెస్ట్ వారెంట్లు త్వరలో జారీ చేయనున్నట్టు సమాచారం.
దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ , ఆమె స్నేహితురాలు చోయ్ సూన్ సిల్ ద్వారా శాంసంగ్ గు, చోయ్ కి సంబంధించిన ఫౌండేషన్స్ కు భారీ ముడుపులు ముట్టినట్టు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంలో 25 మిలియన్ల డాలర్ల మేరకు చెల్లింపులు చేసినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఆరోపణలను శాంసంగ్ ఖండించింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హైను అభిశంసించాలని ఆ దేశ పార్లమెంటు నిర్ణయించింది. ఇదే అంశంపై ఇటీవల పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో 234 మంది సభ్యులు అభిశంసనకు అనుకూలంగా ఓటేశారు. దీంతో హాంగ్ క్యో హన్కు తాత్కాలిక అధ్యక్ష పదవిని అప్పగించారు. దేశాధ్యక్షురాలు పార్క్ గెన్ను తొలిగించాలని ఇటీవల దేశవ్యాప్తంగా భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. అటు తన నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం జరిగినట్లు కూడా పార్క్ కూడా తన తప్పును ఒప్పుకున్నారు. వాస్తవానికి పార్క్ గెన్ స్నేహితురాలు చోయ్ సూన్ సిల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా అధ్యక్షురాలి పేరును వాడుకుని అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడిన చోమ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పార్క్ గెన్ కేసును రాజ్యాంగ కోర్టు విచారిస్తోంది.
కాగా శాంసంగ్ మాజీ అధిపతి, లీ తండ్రి లీ కున్ హీ నిధుల దుర్వినియోగం మరియు పన్ను ఎగవేత పాల్పడిన ఆరోపణలతో 2008 లో పదవికి రాజీనామా చేశారు.