ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లు ఆమోదం
సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పును విభేదిస్తూ జైల్లో ఉన్న వారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లు - 2013కు లోక్సభ శనివారం ఆమోద ముద్ర వేసింది. ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ లోక్సభలో ప్రవేశ పెట్టారు. దాంతో ఆ బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును సిబల్ ఈ సందర్భంగా తప్పుపట్టారు.
సుప్రీం తీర్పును సవరించాల్సిన బాధ్యత పార్లమెంట్పై ఉన్న సంగతిని ఆయన తన ప్రసంగంలో వివరించారు. భారతీయ జనతాపార్టీతో సహా పలు ప్రతిపక్షాలు ఆ బిల్లుకు మద్దుతు తెలిపాయి. దాంతో లోక్సభలో 15 నిమిషాల వ్యవధిలో బిల్లుకు ఆమెదం లభించింది. కాగా రాజ్యసభ ఆగస్టు 27న బిల్లు ఆమెదం పొందిన సంగతి తెలిసిందే. అయితే జైల్లో ఉన్నవాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులంటూ జులై 10న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో సుప్రీం తీర్పుపై పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఇది దుర్వినియోగమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాయి.