సిద్ధూపై న్యాయసలహా కోరిన పంజాబ్ సీఎం
చండీగఢ్: పంజాబ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ టీవీ షోలు కొనసాగించాలని భావిస్తున్నారు. ప్రముఖ రియాలిటీ షో ‘కపిల్ శర్మ కామెడీ నైట్స్’కు సిద్ధూ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో న్యాయసలహా తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. సిద్ధూ టీవీ కార్యక్రమాల్లో పాల్గొనాలా, వద్ద అనే దానిపై అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుంటున్నామని వెల్లడించారు.
‘ఇలాంటి విషయాల్లో రాజ్యాంగం, చట్టం ఏం చెబుతుందో నాకు తెలియదు. అందుకే అడ్వకేట్ జనరల్ ను న్యాయసలహా అడిగాను. మంత్రిగా ఉన్న వ్యక్తి టీవీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చో, లేదో తేలాల్సివుంది. దీని గురించి సిద్ధూతో మాట్లాడాను. న్యాయసలహా వచ్చిన తర్వాత మరోసారి సిద్ధూతో మాట్లాడతాన’ని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని భావించినా చివరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి పదవి కట్టబెట్టారు.