మాజీ భార్య ఫోన్‌లో మాల్‌వేర్‌ పెట్టి..

మాజీ భార్య ఫోన్‌లో మాల్‌వేర్‌ పెట్టి..


కోల్‌కతా: మాజీ భార్య మొబైల్‌ ఫోన్‌లో ఆమెకు తెలియకుండా మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసి, ఆమె ఫోన్‌ కాల్స్‌, మేసేజ్‌లన్నింటినీ గూఢచర్యం చేసిన ఓ వ్యక్తికి 50 వేల రూపాయల జరిమానా పడింది. పశ్చిమబెంగాల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.  



బాధితురాలి వివరాల మేరకు 2013 మేలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చేలా భర్త ప్రవర్తించడంతో పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. ఆ మరుసటి ఏడాదే విడాకులు కోరుతూ హౌరా కోర్టును ఆశ్రయించారు. పెళ్లయిన మొదట్లో తన ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌, ఈ మెయిల్‌ ఎకౌంట్ పాస్‌వర్డ్‌లను భర్తకు చెప్పానని, అన్ని విషయాలు షేర్‌ చేసుకునేదాన్నని, అయితే ఓ సారి తనకు తెలియకుండా తన ఫోన్‌లో మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసి తన కాల్స్‌, మెసేజ్‌లు అన్ని తెలుసుకునేవాడని ఫిర్యాదులో పేర్కొంది.



పశ్చిమబెంగాల్‌ సైబర్‌ న్యాయనిర్ణేత అయిన ఆ రాష్ట్ర ఐటీ కార్యదర్శికి బాధితురాలు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసింది. మాజీ భార్య ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, అన్ని కాల్స్‌, మెసేజ్‌ల వివరాలను ఓ వెబ్‌సైట్‌ ద్వారా మాజీ భర్త తెలుసుకునేవాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నెల రోజుల్లోపు బాధితురాలకు 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని నిందితుడికి ఆదేశించారు. పశ్చిమబెంగాల్‌లో ఇలాంటి తరహా కేసులో జరిమానా విధించడం ఇదే తొలిసారి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top