ఉగ్రవాదికి ఆధార్, ఓటర్ ఐడీ కార్డు
న్యూఢిల్లీ: లంచానికి కక్కుర్తిపడి కొందరు ప్రభుత్వ అధికారులు ఉగ్రవాదికి కూడా ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చారు. బంగ్లాదేశ్కు చెందిన తారిఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాది భారత్లో ఆధార్ కార్డుతోపాటు, ఎన్నికల గుర్తింపు కార్డు కూడా పొందినట్లు అధికార వర్గాల సమాచారం. బుర్ద్వాన్ పేలుళ్లలతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతడిని చివరకు అదుపులోకి తీసుకొని విచారించగా అతడు ఆధార్ కార్డుతోపాటు ఓటర్ ఐడీ కూడా పొందాడని గుర్తించారు.
గతవారం జార్ఖండ్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత తనకు ఆ నేరానికి ఎలాంటి సంబంధం లేనట్లుగా ప్రవర్తించి, అనుమానం రాకుండా జాగ్రత్తపడిన తారిఖ్ చివరకు పలు వివరాలు తెలిపాడు. దీంతోపాటు తాను భారతీయుడిగా గుర్తింపు పొందడంకోసం పలు ప్రయత్నాలు చేశాడని, పలువురు అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చాడని, ముఖ్యంగా స్థానికంగా ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు ఇచ్చే అధికారులకు లంఛం ఇచ్చాడని కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్తో తారిఖ్కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.