కేంద్రం కంటే నేనే తెలివైనవాడిని
- అందుకే ప్యాకేజీకి అంగీకరించా
- కేంద్రం చేయలేక పోలవరం బాధ్యత నాకు అప్పగించింది
- తెలంగాణ ప్రభుత్వం నాపై కేసూ పెట్టే సాహసం చేయలేదు: సీఎం
ఏలూరు(మెట్రో): ఎవరు ఎన్ని కేసులు పెట్టినా తనను ఎవరూ ఏమీ చేయలేరని, తెలంగాణ ప్రభుత్వం తనపై ఏ కేసూ పెట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం అనంతరం సురేష్ బహుగుణ పాఠశాల మై దానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తాను నీతి నిజాయితీలతో జీవనం సాగిస్తున్నానని, అందువల్లే రోజుకు 6 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోతున్నానని పేర్కొన్నారు. తాను ఎవరికో భయపడుతున్నానని అంటున్నారని ఓటుకు కోట్లు కేసు గురించి పరోక్షంగా సీఎం ప్రస్తావించా రు. ఆ కేసు తెలంగాణలో ఉంటే తాను ఎం దుకు భయపడతానని, అయినా తెలంగాణ ప్రభుత్వం తనపై ఏ కేసూ పెట్టే సాహసం చేయలేదని చెప్పుకొచ్చారు. తనమీద బురదజల్లే యత్నం చేస్తున్నారని, ఎవరు ఎన్నిసార్లు యత్నించినా తనను ఎవరూ ఏమీ చేయలేరని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
అందరికంటే సీనియర్ నాయకుడిని నేనే..!
తాను చాలా తెలివైన వాడినని, కేంద్రం కంటే ఎక్కువ తెలివి ఉందని, తాను అందరి కంటే సీనియర్ నాయకుడినని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తెలివైన వాడిని కాబట్టే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాను తప్ప ఇంకొకటి కాదన్నారు. డబ్బులుంటే రాష్ట్రాన్ని నంబర్ వన్గా తయారు చేస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేయలేక ఆ బాధ్యతను తనకు అప్పగించిందని చంద్రబాబు చెప్పారు.