‘సీటా’భివందనం...


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల కిందట ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. చంద్రబాబు వెంట పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ నేతలు కూడా ఉన్నారు. ఆ బృందంలోని తెలంగాణ నేత ఒకరు రాజ్‌నాథ్ కనిపించినదే తడవుగా ఆయనకు పాదాభివందనం చేశారు. ఇది గమనించిన మిగిలిన నేతలు ఉండబట్టలేక... ఇప్పుడే అంతగా వంగి వంగి దండాలు పెట్టడమేమిటబ్బా అని అడిగితే, గతంలో బీజేపీ అనుబంధ విభాగంలో పనిచేశానని, ఆ అభిమానంతోనే పాదాభివందనం చేశానని ఆ నేత చెప్పారట. అందరిలోనూ ఆ మాట అన్నా, అసలు రహస్యం వేరే ఉందని ఆ తర్వాత మిగిలిన నేతలు తెలుసుకున్నారట.

 

  అదేమిటంటే... సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగి, ఆ తర్వాత చంద్రబాబుపై భేరీ మోగించి బీజేపీలో చేరిన ఆ జిల్లాకే చెందిన ఒక నాయకుడి కారణంగా ఈ నేత అలా చేయాల్సి వచ్చిందట. రాజ్‌నాథ్‌కు పాదాభివందనం చేసిన నేతకు, బీజేపీలో చేరిన అదే జిల్లాకు చెందిన నేతకు... ఇద్దరూ టీడీపీలోనే ఉన్నప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదట. బీజేపీ, టీడీపీల మధ్య ఎన్నికల పొత్తు కుదురుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ అదే నిజమైతే, బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ మాజీ నేత నుంచి ఎన్నికల సమయంలో టికెట్లు, సీటు విషయంలో ఎలాంటి కిరికిరి లేకుండా ఉండేందుకే బీజేపీ అధినేతకు పాదాభివందనం చేశానని, తద్వారా అటు నుంచి నరుక్కొస్తున్నానని ఆ నేత వివరణ ఇచ్చారట. అసలు సంగతి తెలిసిన పార్టీ నేతలు... పాదాభివందనం వెనుక ఇంత కథ ఉందా అంటూ ముక్కున వేలేసుకున్నారట.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top