మిమిక్రీ ఫోన్కాల్తో 29మంది బాబులకు షాక్!
పెద్దనోట్ల రద్దుతో దేశమంతా అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఓ మిమిక్రీ ఆర్టిస్టు తన సుప్రీంటాలెంట్తో ఓ ట్రిక్ ప్లే చేశాడు. ఓ మంత్రి వాయిస్ను అనుకరిస్తూ.. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి.. ఏకంగా 29మంది బాబులను బదిలీ చేయించాడు. ఉన్నపళంగా తాము బదిలీ కావడంతో లబోదిబోమనడం ప్రభుత్వ అధికారుల వంతైంది.
తమిళనాడుకు చెందిన మిమిక్రీ కళాకారుడు సావరి ముత్తు ఇలా అధికారులను బదిలీ చేయించి.. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. ముత్తు తన టాలెంట్తో తమిళనాడు విద్యుత్శాఖ మంత్రి పీ థంగమణి స్వరాన్ని అనుకరిస్తూ ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు ఫోన్ చేశాడు. థర్మల్ యూనిట్లో ఉన్న అధికారులను ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేయించాడు. ఇదేవిధంగా అసిస్టెంట్ ఇంజినీర్ జయకుమార్ను విద్యుత్ ప్రొడక్షన్ యూనిట్ నుంచి బొగ్గు నిర్వహణ సెక్షన్కు బదిలీ చేయించాడు. అంతేకాకుండా జయకుమార్ సరిగ్గా తన విధులు నిర్వహించడం లేదని ఆరోపిస్తూ అతనిపై సస్పెన్షన్ వేటు వేయించాడు.
దీంతో సహోద్యోగుల సూచన మేరకు జయకుమార్ నేరుగా మంత్రి థంగమణిని కలిశాడు. ఈ విషయం తెలుసుకొని మంత్రి థంగమణి షాక్ తిన్నాడు. తాను ఎవరినీ బదిలీ చేయించలేదని, ఇందులో గోల్మాల్ ఉందని, ఈ వ్యవహారంలో పోలీసులకు విచారణకు ఆదేశించాడు. దీంతో ఉన్నతాధికారుల సెల్ఫోన్లకు వచ్చిన కాల్స్ను పరిశీలించగా.. అసలు గుట్టు రట్టయింది. దీంతో దిండిగల్ జిల్లాకు చెందిన మిమిక్రీ కళాకారుడు ముత్తే ఇలా తన వాయిస్ మిమిక్రీతో బదిలీలు చేయించినట్టు తేలింది. అయితే, ఈ వ్యవహారంలో అరెస్టైన ముత్తు తానెందుకు మంత్రి స్వరాన్ని అనుకరించి ఈ బాగోతానికి తెరలేపాడో చెప్పలేదు.
సంబంధిత వార్తలు