సూరంపాలెంలో ‘రంగస్థలం’
పాట చిత్రీకరణ
సినిమా షూటింగ్ చూసేందుకు ఎగబడిన జనం
గంగవరం (రంపచోడవరం): ప్రముఖ హీరో హీరోయిన్లు రామ్చరణ్, సమంత జంటగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ గంగవరం మండలం సూరంపాలెం రిజర్వాయర్ వద్ద ఆదివారం జరిగింది. దర్శకుడు సుకుమార్, నృత్య దర్శకుడు ప్రేమ్రక్షిత్ పర్యవేక్షణలో గ్రూప్ సాంగ్ చిత్రీకరించారు. రిజర్వాయర్ శివారు అటవీ ప్రాంతంలో ఉదయం నుంచీ పాట చిత్రీకరణ జరిగింది. ఇందుకోసం సుమారు 30 బోట్లు వినియోగించారు. అభిమాన హీరో హీరోయిన్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ చిత్రం కోసం ఇటీవల చిత్రించిన ఒక పాట యూట్యూబ్లో హల్చల్ చేయడంతో సెల్ఫోన్ కెమెరాలకు స్టిల్స్ చిక్కకుండా యూనిట్ జాగ్రత్తలు తీసుకొంది. అభిమానులు దగ్గరగా రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. షూటింగ్ చూసేందుకు, నటీనటులతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించినా అవకాశం దక్కలేదు. మధ్యాహ్నం నుంచి రిజర్వాయర్ గట్టు వద్ద పాట చిత్రించారు. గట్టు సమీపంలో పాట చిత్రీకరణ ముగించుకొని సెట్లో ఉన్న రామ్చరణ్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. రామ్చరణ్ బయటకు రావాలని నినదించారు. దీంతో రామ్చరణ్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం బోటులో రిజర్వాయర్ స్పిల్వే వద్దకు చేరుకొని కారులో వెళ్లిపోయారు. దర్శకుడు సుకుమార్, జబర్దస్త్ నటుడు మహేష్తో అభిమానులు సెల్ఫీలు దిగారు.