జెడ్పీ స్థాయీ సంఘాల ప్రాధాన్యం పెరిగేనా?

ZPTCs Functions Are Not Started In Adilabad - Sakshi

సమావేశాలు మొదలైతేనే గాడిలో పడేది..

విపక్షం ఢీ కొడుతుందా..

సాక్షి, ఆదిలాబాద్‌: కొత్త జెడ్పీ.. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు దాటింది. పాలన వ్యవహారాలు ప్రారంభమైతేనే పనితీరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. పాలకవర్గం ఇంకా క్రియాశీలకం కాలేదు. సమావేశాల నిర్వహణతోనే ఇటు జెడ్పీలో అధికారులు, సిబ్బంది పరంగా విధుల నిర్వహణ, ఇటు పాలకవర్గం వ్యవహారం స్పష్టం అవుతుంది. ప్రస్తుతం కొత్త జెడ్పీ పాలకవర్గం ‘స్థాయీ’ పెంచేలా వ్యవహరిస్తుందా.. లేదా అనేది భవిష్యత్‌ నిర్ధారించనుంది. మ్మడి జిల్లా ఉన్నప్పుడు 52 మండలాలతో జెడ్పీ పాలన సందడిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపాటు కొత్త జెడ్పీలు ఏర్పాటు చేయడంతో మార్పులు జరిగాయి. అప్పుడు 52 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉండగా, ప్రస్తుతం కొత్త జిల్లాలో 18 మండలాల్లో ఆదిలాబాద్‌అర్బన్‌ మండలం మినహా 17 మంది ఉన్నారు. దీంతో స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశంలో మునపటి సభ్యుల సందడి కనిపించే అవకాశం లేదు. అయితే ప్రస్తుత పాలకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌ తొమ్మిది మంది సభ్యులను కలిగి ఉంది.

ఇక బీజేపీ ఐదుగురు, కాంగ్రెస్‌ ముగ్గురు జెడ్పీటీసీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఉట్నూర్‌ జెడ్పీటీసీ చారులత జెడ్పీ చైర్మన్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. దీంతో ఆమె కాంగ్రెస్‌ వైపు ఉండే అవకాశాలు లేవు. అయినా జెడ్పీచైర్మన్‌ ఎన్నిక సమయంలో ఐదుమంది సభ్యులు ఉన్న బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దించడం, దానికి కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే మెజార్టీ సభ్యులు టీఆర్‌ఎస్‌ వైపు ఉండడంతో పాలకవర్గం అధికార పార్టీ వంతైంది. ఇదిలా ఉంటే స్థాయీ సంఘం, సర్వసభ్య సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు కలిసి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని సమస్యలపై ఎండగట్టే అవకాశాలు లేకపోలేదు.

అలాంటి సమయంలో రాజకీయాలకే కొత్తైన జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ సమర్థవంతంగా వారిని తిప్పికొడతారా.. లేనిపక్షంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది సమావేశాల్లోనే స్పష్టమయ్యే పరిస్థితి ఉంది. సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అయితే స్థాయీ సంఘాల్లో మాత్రం వారిని కూడా సభ్యులుగా తీసుకోనున్నారు. కాగా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ వారే ఉండటంతో పాలక పక్షానికి బలంగా ఉంది. అయితే ఎంపీ బీజేపీ సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండటం, ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో సమావేశాల్లో వాడీవేడి ఉండే అవకాశాలు లేకపోలేదు.

స్థాయీ సంఘాలు కీలకం..
జిల్లా పరిషత్‌ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన 60 రోజుల్లోపు స్థాయీ సంఘాలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏడు స్థాయీ సంఘాలు ఉన్నాయి. వాటిలో ప్రణాళిక ఆర్థిక పన్నులు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళ సంక్షేమం, సాంఘిక సంక్షే మం, నిర్మాణ పనుల స్థాయీ కమిటీలు ఉన్నా యి. ఇందులో ప్రణాళిక ఆర్థిక పన్నులు, నిర్మాణ పనుల స్థాయి కమిటీలకు సభ్యుల నుంచి అధిక డిమాండ్‌ ఉంటుంది. అయితే ప్రస్తుతం జెడ్పీలో 17మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, కోఆప్షన్‌ సభ్యులను మన జెడ్పీ స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గాలు సంపూర్ణంగా ఉండగా, ఆసిఫాబాద్, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోని మండలాలు పాక్షికంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, బోథ్‌ ఎమ్మెల్యేలతోపాటు ఆసిఫాబాద్, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలను కూడా స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోవాల్సి వస్తుందా.. లేదా అనే విషయంలో జెడ్పీ ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిబంధన ఉందో ఇక్కడ కూడా అదే అమలవ్వాలని ఉంది. తద్వారా జిల్లాలో పాక్షికంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆదిలాబాద్‌ జెడ్పీ స్థాయీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తారా.. లేదా అన్నది త్వరలో తేలిపోనుంది. అయితే ఈ స్టాండింగ్‌ కమిటీల నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో కదలిక కనబడటంలేదు. సుమారు నెలరోజుల సమయం ఉండడంతో అధికారులు పై విషయాల్లో స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ వర్గం నుంచి గెలిచిన రఘోత్తం రెడ్డి, పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జీవన్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన పురాణం సతీశ్‌లు ఉన్నారు.

అయితే పురాణం సతీశ్‌ను స్థాయీ సంఘంలో సభ్యుడిగా తీసుకునే విషయంలో అధికారులు స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా సతీశ్‌ మంచిర్యాల జిల్లా ఓటరుగా ఉండడంతో అక్కడి జెడ్పీలోనే స్థాయీ సంఘం సభ్యుడిగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా అధికార పార్టీ సభ్యులకే స్థాయీ సంఘంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అదే సమయంలో విపక్ష సభ్యులకు కూడా సంఘాల్లో అవకాశం కల్పించినా అప్రాధాన్యత సంఘాల్లో వారికి చోటు కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పాలకవర్గాన్ని విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో త్వరలో తేలిపోనుంది.

సమావేశాలతోనే పాలనలో పరుగు
జెడ్పీ కొలువుదీరి నెలరోజులు దాటినా ఇప్పటికీ పాలన పట్టాలెక్కలేదు. ప్రధానంగా సమావేశాల ప్రారంభంతోనే వేగం పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరంగా ఆదిలాబాద్‌ జెడ్పీలో 69 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. అయితే నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌లో కొత్త జెడ్పీల ఏర్పాటుతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులనే అక్కడికి విభజించారు. ప్రస్తుతం కొత్త ఆదిలాబాద్‌ జెడ్పీలో 22 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ప్లానింగ్, అకౌంట్స్, వర్క్స్, జీపీఎఫ్, విద్య సెక్షన్లను ఒక్కొక్క సూపరింటెండెంట్‌ పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఈ ఐదు సెక్షన్లకు కలిపి ఇద్దరు సూపరింటెండెంట్లను నియమించారు. అయితే ఇప్పటికి కార్యకలాపాల పరంగా వేగం పుంజుకోలేదు. ప్రధానంగా ఒకట్రెండు సమావేశాలు జరిగి విధివిధానాలు స్పష్టమైతేనే జెడ్పీలో అధికార కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది.

సీఈఓలకే నిధుల కేటాయింపు అధికారం..
ఆదిలాబాద్‌ జెడ్పీలో ఎన్నికల సమయంలో, ప్రమాణస్వీకారం రోజు సీఈఓగా ఉన్న నరేందర్‌ను ఇక్కడి నుంచి మంచిర్యాలకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం కిషన్‌ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యలో సీఈఓగా వేణు అనే అధికారి ఇక్కడికి బదిలీపై వచ్చి ఒకేరోజు పనిచేసి వెళ్లిపోయారు. ప్రధానంగా రెవెన్యూ అధికారి అయిన వేణు జెడ్పీ కార్యకలాపాల్లో పీఆర్‌ సిబ్బంది మధ్య ఇక్కడ ఇమడలేకపోయారన్న విమర్శ లేకపోలేదు. అదే సమయంలో గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జెడ్పీలోనే ఏఓగా పనిచేసిన కిషన్‌ ఆదిలాబాద్‌ జెడ్పీ సీఈఓగా రావడం యాదృచ్చికంగా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఉమ్మడి పాలకవర్గంలో జెడ్పీకి వివిధ పథకాల కింద నిధుల కేటాయింపు జరగకపోవడంపై అప్పట్లో సభ్యులు ప్రతీ సమావేశంలోనూ ఆక్షేపన వ్యక్తం చేసేవారు. ప్రస్తుతం కొత్త జెడ్పీలకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిధుల విడుదల, వినియోగం, అధికారాలను జెడ్పీ సీఈఓకు కల్పిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో జెడ్పీ సీఈఓల ఆమోదం తర్వాత నిధుల కేటాయింపు, విడుదల, పంపిణీ అధికారాలు డిప్యూటీ సీఈఓలకు ఉండగా, ప్రస్తుతం మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఈఓల పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వారి స్థానంలో ప్రతీ జెడ్పీకి అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టును కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి జెడ్పీకి ఏఓగా వ్యవహరించిన కిషన్‌ ప్రస్తుతం సీఈఓగా నిధుల విడుదల, వినియోగంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.

ఆదేశాలు రావడమే తరువాయి
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే స్థాయీ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఈ సంఘాల ఏర్పాటుతోపాటు మన జెడ్పీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. – కిషన్, జెడ్పీ సీఈఓ

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top