శీతాకాలం గరంగరం
సమావేశాల్లో 8 ఆర్డినెన్స్లు.. కొత్త పంచాయతీరాజ్ చట్టం
పెండింగ్ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణ
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా అధికార పార్టీ వ్యూహం
‘చలో అసెంబ్లీ’తో సమావేశాలను వేడెక్కించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కిన తరుణంలో అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలు గరంగరంగా సాగనున్నాయి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు తెలియ జెప్పేందుకు సమావేశాలను సరైన వేదికగా మలుచుకునేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే వీలైనన్ని ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కేంద్రంతో ముడిపడి ఉన్న విభజన అంశాలు, ఢిల్లీలో పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలను చట్టసభల వేదికగా ప్రస్తావిస్తూ మరోమారు ఒత్తిడి పెంచే కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
పంచాయతీ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇదే అనువైన సమయంగా ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు ఇటీవల అమల్లోకి తెచ్చిన ఎనిమిది ఆర్డినెన్స్లను ఈ సమావేశాల్లో చట్ట రూపంలోకి తీసుకువచ్చేందుకు బిల్లులు తయారుచేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు కూడా ఈ సమావేశాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ చట్టంపై ఏప్రిల్ 30న అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశమయ్యాయి.
ఆ చట్టానికి సంబంధించి పలు సవరణలను పది నిమిషాల్లోనే ఆమోదించటంతో సమావేశాలు ముగిశాయి. మళ్లీ దాదాపు ఆరు నెలల వ్యవధి తర్వాత ఎనిమిదో విడత సమావేశాలు ప్రారంభమవుతుండటంతో విపక్షాలు సైతం అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ దాదాపు 18 అంశాలతో ఎజెండాను సిద్ధం చేసుకుంది. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ పార్టీ తొలిరోజునే ఆందోళనకు పిలుపునివ్వడంతో సమావేశాలు గరంగరంగానే ప్రారంభం కానున్నాయి.
భవనాల అప్పగింతకు ఏపీ ఓకే
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న ఏపీ అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ బీఏసీ సమావేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నుంచి తనకు సమాచారం అందినట్లు వెల్లడించారు.
గవర్నర్తో సీఎం భేటీ
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. గురువారం ఉదయం అసెంబ్లీ, కౌన్సిల్ బీఏసీ సమావేశంలో పాల్గొన్న సీఎం.. అక్కణ్నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. సమావేశాల్లో ప్రభుత్వం తరఫున చర్చించే అంశాలు, ప్రవేశపెట్టనున్న బిల్లులు, ఇప్పటికే అమల్లో ఉన్న ఆర్డినెన్స్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు గంటన్నరపాటు గవర్నర్తో వివిధ అంశాలను చర్చించారు.