నెల్లికల్ అడవిలో వ్యూ పాయింట్
నాగార్జున సాగర్ సందర్శకుల కోసం వాచ్టవర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ సందర్శకుల కోసం మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. గతవారం శ్రీశైలం దగ్గర ఆక్టోపస్ వ్యూ పాయింట్ను ప్రారంభించిన రాష్ట్ర అటవీ శాఖ ఈసారి నాగార్జున సాగర్ సమీపంలో వాచ్టవర్ను అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ అనుకూల పర్యాటక రంగం(ఎకో టూరిజం) అభివృద్ధిలో భాగంగా ఈ వాచ్టవర్ను నిర్మించింది.
హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ రోడ్డులో సాగర్ చేరు కోవడానికి ఐదు కిలోమీటర్ల ముందే.. నెల్లికల్ అడవి బ్లాక్లో దీనిని ఏర్పాటుచేశారు. సముద్రమట్టానికి 1,050 అడుగుల ఎత్తులో ఉండే ఈ వాచ్టవర్ నుంచి అడవి, కృష్ణా నదీ అందాలను, నాగార్జునసాగర్ డ్యామ్ బ్యాక్వాటర్ను కూడా చూడవచ్చు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎం.సి.పర్గయిన్ ఈ వాచ్టవర్ను శనివారం ప్రారంభించారు. మెయిన్ రోడ్డు నుంచి అటవీ ప్రాంతంలోకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వాచ్టవర్ ఉంది. అక్కడ 200 మీటర్ల వాకింగ్ ట్రాక్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.