హృదయ విదారకం

Two Women Died In Road Accident At Warangal - Sakshi

కాల్వలో పడిన కారు

అత్తా, కోడలు దుర్మరణం

సాక్షి, మరిపెడ: ప్రమాదవశాత్తు కారు కాల్వలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న అత్తా, కోడలితో పాటు కోడలి కడుపులోని శిశువూ మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం గొల్లగూడెం వద్ద చోటుచేసుకుంది. మృతులు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన వారు. స్థానికుల కథనం ప్రకారం.. పోగుల రవీందర్‌రెడ్డి, ఇందిరా(45) దంపతుల పెద్ద కుమారుడు మహిపాల్‌రెడ్డికి నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన ఇట్టి దామోదర్‌రెడ్డి, పద్మ దంపతుల రెండో కుమార్తె స్వాతి(28)తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. మహిపాల్‌రెడ్డి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా నెల్లికుదురులో విధులు నిర్వహిస్తున్నాడు.

భార్య స్వాతి గర్భవతి కావడంతో రెండు రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించడానికి వెళ్లారు. ఆదివారం రిపోర్టులు వస్తాయని చెప్పడంతో  మహిపాల్‌ తన తల్లి ఇందిరా, భార్య స్వాతితో కలిసి కారులో ఖమ్మంకు బయలుదేరారు. మార్గ మధ్యన గొల్లగూడెం సమీపాన ఉన్న కాల్వ వద్దకు రాగానే.. మూత్ర విసర్జన కోసమని కొద్ది దూరంలో ఆగారు. అనంతరం కారు రివర్స్‌ తీస్తున్న సమయంలో అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఇందిరా, స్వాతి అక్కడిక్కడే మృతి చెందగా.. మహిపాల్‌రెడ్డిని స్థానికులు కాపాడారు. మృతి చెందిన స్వాతి నిండు గర్భవతి కావడంతో స్థానికుల సహయంతో ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆపరేషన్‌ చేసి మగశిశువును వెలికి తీసారు. అప్పటికే శిశువు ప్రాణాలు వదిలినట్లు స్థానికులు చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top