2 వారాలు కీలకం
కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలే ఏకైక ఆయుధం
లేకపోతే వైరస్ను కట్టడి చేయలేమంటున్న నిపుణులు
పరిస్థితి చేజారితే కరోనా కోరలు చాచినట్లే
ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన తరుణమిదే
‘నిజాముద్దీన్’ లింక్ బయటపడ్డా మారని జనం
బుధవారం హైదరాబాద్, పట్టణాల్లో రద్దీగానే రోడ్లు
సాక్షి, హైదరాబాద్: బ్రేక్ ది చైన్.. గత పది రోజులుగా విస్తృతంగా వినిపిస్తున్న మాట ఇది. కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా మనం బయటపడాలంటే కచ్చితంగా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలంటూ ఉద్యమం తరహాలో ఈ నినాదం వెల్లువెత్తింది. దాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇంతకాలం దాని అమలు ఎలా ఉందో పక్కనపెడితే ఇకపై లాక్ డౌన్ను కచ్చితంగా అమలు చేయాల్సిన సమయం ఆస న్నమైంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్రం కరోనా హస్తాల్లో చిక్కుకొని విలవి ల్లాడకుండా ఉండాలంటే తు.చ. తప్పకుండా లాక్ డౌన్ అమలు కావాల్సిందే. కరోనా వైరస్ను తరిమి కొట్టాలంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఏౖకైక ఆయుధం ఇదొక్కటే. పది రోజుల క్రితం లాక్డౌన్ను అమలులోకి తెచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రి కేసీఆర్ వినమ్రంగా పలుమార్లు ఇదే విషయాన్ని జనం ముందుంచారు.
అంతర్జాతీయ నిపు ణులు, వైద్యులు పదేపడే చెబుతూ వచ్చారు. కానీ ఆ మాటలను ప్రజలు పెద్దగా లెక్క చేయకుండా రకరకాల కారణాలతో రోడ్లపైకి వచ్చి లాక్డౌన్ను అపహాస్యం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వచ్చే రెండు వారాలు లాక్డౌన్ స్ఫూర్తిని స్వచ్ఛందంగా అమలు చేయకుంటే ఇక పరిస్థితి చేయిదాటిపోవడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించి స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైతే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే అవకాశం ఉంటుందని లేకపోతే కరోనాను అదుపు చేయలేక విలవిల్లాడాల్సి వస్తుందం టున్నారు. వెరసి వచ్చే రెండు వారాలను సువర్ణావకాశంగా అభివర్ణిస్తున్నారు. కరోనా కోరల్లో చిక్కుకోవాలో లేక మహమ్మారిని తరిమి కొట్టాలో అన్నది ఇప్పుడు ప్రజల చేతుల్లోనే ఉంది.
నిజాముద్దీన్ ఉదంతంతో కలకలం...
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి క్వారంటైన్ గడువు మరో 4 రోజుల్లో ముగియనుండటంతో ఇక కరోనా వైరస్ ప్రభావం నుంచి మనం తప్పించు కున్నట్లేనని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ‘నిజాముద్దీన్’ ఉదంతం పరిస్థితిని ఒక్క సారిగా తీవ్ర ఆందోళనకరంగా మార్చేసింది. వెయ్యి మందికిపైగా తెలంగాణవాసులు ఈ సమావేశానికి హాజరై స్వస్థలాలకు వెళ్లి జనం మధ్య తిరగడంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
మారని ప్రజల తీరు...
నిజాముద్దీన్ ప్రార్థనల రూపంలో కరోనా వైరస్ మన మధ్యకు తీవ్రంగా చొచ్చు కొచ్చిందన్న వార్తలు వెలువడ్డ రోజే జనం భయం, బాధ్యత లేకుండా వీధులను రద్దీగా మార్చేయడం ఆశ్చర్యం కలిగించింది. రాజధాని హైదరాబాదే కాదు... రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించిం ది. పాలు, కూరగాయలు, మందులు, ఎమర్జెన్సీ అంటూ ఏదో పేరు చెప్పి ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.
ఉదయం 10 గంటలు
ఓల్డ్ సిటీలోని మాదన్నపేట కూరగాయల మార్కెట్ జనంతో కిక్కిరిసి కనిపించింది. సగం మంది కనీసం రుమాలు కూడా ముక్కు, నోటికి అడ్డుగా కట్టుకోకపోవడం ఆందోళన కలిగించే అంశం.
బుధవారం సాయంత్రం 4 గంటలు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడ్డ వారికి చికిత్స అందిస్తున్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ముందున్న ప్రధాన రహదారి వాహనాలతో కిటకిటలాడింది.
సాయంత్రం 4 గంటలు
ఖైరతాబాద్ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తుండగా సాధారణ రోజుల్లో తరహాలోనే వాహనాలు దూసుకొస్తున్న దృశ్యం.
ఉదయం నుంచి సాయంత్రం వరకు
మల్లేపల్లి కూడలిలో ఒకరిని ఒకరు తగిలేంత దగ్గరగా యువకులు గుంపులుగా కూర్చున్నారు.
ప్రజల్లో భయం, బాధ్యత ఏదీ?
మన దేశంలో కనిపించిన కరోనా వైరస్ చైనాలో ఉన్నంత శక్తివంతమైనది కాదనే భావన తొలుత వ్యక్తమైంది. కానీ ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వైరస్ బారినపడి చనిపోయిన వారి శరీరంలో కనిపించిన లక్షణాలను బట్టి చూస్తే అది శక్తివంతమైనదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంతా దీన్ని గుర్తించి సహకరిస్తేనే కరోనాను నియంత్రించగలం. అందుకు జనం ఒకచోట సమూహంగా చేరడాన్ని పూర్తిగా నియంత్రించాలి. జలుబు లక్షణాలున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలి. పట్టణాల్లో జనం తీరును చూస్తే ఆందోళన కలుగుతోంది. రోడ్లపైకి చిన్న, చిన్న కారణాలతో వచ్చే వారిలో భయం, బాధ్యత కనిపించట్లేదు. అవసరమైతే వారిపై బలప్రయోగం చేయాల్సిందే. లేకుంటే రాష్ట్రం, తద్వారా దేశం బలవుతుంది– డాక్టర్ కె.ప్రతాప్, వైద్య, ఆరోగ్య శాఖ విశ్రాంత సీనియర్ అధికారి
గ్రామాల్లో ఉన్న స్ఫూర్తి పట్టణాలకేమైంది?
గ్రామాల్లో ప్రజలు ఎంతో స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు. బయటి నుంచి కొత్తవారు రాకుండా నియంత్రించి వైరస్ గ్రామంలోకి ప్రవేశించకుండా చూస్తున్నారు. ఇప్పుడు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. పని ఉంటే తప్ప బయటకు రావటం లేదు. గతంలోలాగా రచ్చబండ ముచ్చట్లు కనిపించట్లేదు. సర్పంచులు ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపట్టారు. వారికి ప్రజలు సహకరిస్తున్నారు. కానీ పట్టణాల్లో ఈ స్ఫూర్తి కొరవడింది. అకారణంగా జనం రోడ్లపైకి వచ్చి గుంపులుగా తిరుగుతున్నారు. ‘నిజాముద్దీన్’ వ్యవహారంతో ఆందోళన వ్యక్తమవుతున్నా మతపరమైన ప్రార్థనలకు ఒకచోటకు చేరుతున్నారు. మతం, వర్గం అని చూడకుండా ప్రభుత్వం కచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన తరుణమిది. జనం మాట విననప్పుడు ప్రభుత్వం నిర్బంధంగా నిబంధనలు అమలు చేయాల్సిందే. ఓపికగా చెప్పి చూసినా ఫలితం లేనప్పుడు కఠినంగా ఉండైనా జనాన్ని నియంత్రించాలి.ఆ తరుణం ఆసన్నమైంది. – డాక్టర్ రాజారెడ్డి, సీనియర్ సర్జన్