సమ్మెతో రాకపోకలు కష్టమే!
ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
నేడు ఆర్ఎం కార్యాలయం ముట్టడి
భారీ సంఖ్యలో తరలనున్న కార్మికులు
సాక్షి, జనగామ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్తో అక్టోబర్ ఐదో తేదీన తలపెట్టిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్ సన్నాహాక కార్యక్రమాలు నేటి నుంచే మొదలుకానున్నాయి. ప్రధానంగా నాలుగు కార్మిక సంఘాల ఐక్యసంఘటనతో ఉద్యమ కార్యాచరణలో భాగంగా నాయకులు సోమవారం(నేడు) వరంగల్ రీజియన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జనగామ డిపో పరిధి సుమారు 200 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధులకు గైర్హాజరు కానున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా హైదరాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బ న్ ప్రాంతాలకు నిత్యం వెళ్లే ఆర్టీసీ బస్సుల సర్వీసులు నిలిపివేయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. దీంతో ప్రజలు ప్రైవేట్ వాహనాల చార్టీల మోత చవిచూడాల్సి వస్తోంది. గతంలో కంటే ఈసారి ఆర్టీసీ కార్మికులు తమ భవితకు పునాదులైన ఉద్యోగ భద్రత విషయంలో రాజీపడేది లేదనే ప్రధాన డిమాండ్తో మూడు దశాబ్దాల కిందట కొనసాగిన సమ్మె వైఫల్యాలను అధిగమించేందుకు కలిసొచ్చిన నాలుగు కార్మిక సంఘాలతో పటిష్టమైన ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొంటున్నారు.