ఇది రైతు ప్రభుత్వం: హరీశ్ రావు
సాక్షి, హుస్నాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. బుధవారం ఆయన హుస్నాబాద్లో మట్లాడుతూ..హుస్నాబాద్ కరువు పీడిత ప్రాంతమని గుర్తించి సీఎం కేసీఆర్ గౌరవెల్లి రిజర్వాయరును 8 టీఎంసీలకు పెంచారన్నారు. కాంగ్రెస్ హయంలో రైతులను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ‘ శనిగరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పూర్తి చేశాం. సింగరాయ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిం చేస్తా’ అని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో శనిగరం, సింగరాయ ప్రాజెక్టులు లింకు చేసి ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాగు నీరు అందనున్నది అని మంత్రి పేర్కొన్నారు.